వికారాబాద్ లోని డైట్ కళాశాలలో నిర్వహించిన అతిథి అధ్యాపకుల ఎంపికను రద్దు చేయాలని అంబేద్కర్ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల మల్లేశం డిమాండ్ చేశారు. అతిథి అధ్యాపక ఎంపికలో అవకతవకలు జరిగాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా, న్యాయ నిర్ణేతల పక్షపాత వైఖరి బంధుప్రీతితో జరిగిందని పేర్కొంటూ ఆ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కు, జిల్లా విద్యాధికారి కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధన డెమో ఆధారంగా ఈ ఎంపిక చేస్తున్నట్లు తెలిపిన డైట్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రతిభను గుర్తించకుండా పక్షపాత వైఖరి అవలంభించారని అన్నారు. ప్రతిభగల అభ్యర్థులకు అన్యాయం చేస్తూ న్యాయ నిర్ణేతలు వారి బంధువులకు ఇప్పించుకున్నారని ఆరోపించారు.
దీని ద్వారా ఉపాధ్యాయ శిక్షణ అభ్యర్థులకు సరైన బోధన జరగదని అన్నారు. తద్వారా వారు విద్యార్థులకు బోధించే పాఠాలలో కూడా నాణ్యత లోపించి అనేకమంది జీవితాలు నాశనం అవుతాయన్నారు. సమాజానికి నష్టం కలిగించే ఈ ప్రిన్సిపల్ న్యాయ నిర్ణేతలు చేపట్టిన ఎంపికను వెంటనే రద్దుచేసి తిరిగి ఎంపిక ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ప్రజా సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు కే.సురేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ప్రభాకర్, తాండూరు డివిజన్ కార్యదర్శి బుడగ జంగం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.