తెలంగాణలో త్వరలోనే రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి రానుంది. ఎప్పుడో నిజాం కాలంలో ఏర్పాటైన జహీరాబాద్ వయా వికారాబాద్-పర్లీ వైజ్యనాథ్ ట్రైన్ మార్గం సెకండ్ లైన్ మంజూరు చేస్తూ రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని ట్రైన్ ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చేలా ఈ కొత్త ట్రైన్ మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. వికారాబాద్-పర్లీ వైజ్యనాథ్ మార్గం డబ్లింగ్ పనులతో పాటు తాండూరు సిమెంట్ క్లస్టర్ నుంచి జహీరాబాద్ వరకు మరో కొత్త ట్రైన్ లైన్ ఏర్పాటుకు ఇటీవల సర్వే పనులు పూర్తయ్యాయి.
ఈ మార్గాల్లో ట్రైన్ ప్రయాణికులతో పాటు సరకు రవాణా కోసం తాండూరు సిమెంట్ క్లస్టర్ నుంచి జహీరాబాద్ను కలుతూ ఈ మార్గాన్ని నిర్మిస్తున్నారు. రూ.1,350 కోట్ల నిధులతో 75 కి.మీ. పొడవునా ఈ కొత్త రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. దీంతో తెలంగాణలోని జహీరాబాద్, బంట్వారం, పెద్దేముల్ మండలాల మీదుగా పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోని కుంచవరం తాలుకా ప్రాంతం వరకు ట్రైన్ ప్రయాణం అందుబాటులోకి రానుంది. తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో పారిశ్రామిక ప్రాంతంగా పేరొందిన జహీరాబాద్ సిటీకి మరో ట్రైన్ మార్గం కూడా అనుసంధానం కానుంది.
జహీరాబాద్ మండలంలోని శేఖాపూర్-మల్చెల్మ గ్రామాలు, కోహీర్ మండలంలోని గొడిగార్పల్లి-బడంపేట్ గ్రామాలు, కర్ణాటకలోని కుంచవరం, వికారాబాద్ జిల్లా బంట్వారం మండలంలోని పెద్దేముల్, బొప్పనారం మండలంలోని ఇందూరు, తట్టేపల్లి, గొట్లపల్లి, తాండూరు మండలం కరణ్కోట్, మల్కాపూర్, చెల్కటూర్ గ్రామాల్లో కొత్త సేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. ఇక జహీరాబాద్ మీదుగా వికారాబాద్-పర్లీ వైజ్యనాథ్ ట్రైన్ మార్గాన్ని రెండో లైన్గా మార్చితే తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర మధ్య ప్రయాణాలు సాగించేవారికి ప్రయోజనం చేకూరనుంది. ఈ మార్గంలో మొత్తం 270 కి.మీ. పొడవున రెండో లైన్ ఏర్పాటు పూర్తయితే రైళ్ల సంఖ్య కూడా పెరగనుంది. ఈ మార్గంలో 20 స్టేషన్ల మీదుగా అదనపు దూర ప్రాంతాలకు వెళ్లే ట్రైన్లు పరుగులు తీయనున్నాయి. పాత మార్గం కావడంతో భూసేకరణ పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. దీంతో త్వరలోనే రెండో లైన్ నిర్మాణ పనులు పట్టాలెక్కనున్నట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.
ఈ ట్రైన్ మార్గం నిర్మాణం కోసం ఇప్పటికే ప్రైవేటు ఏజెన్సీ సర్వే పూర్తి చేసింది. ఆ సంస్థ తమ నివేదికను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకు సమర్పించింది. కొత్త ట్రైన్ మార్గంలో గేట్లు అవసరం లేకుండా ఆర్వోబీలు నిర్మించనున్నారు. అండర్ బ్రిడ్జిలు నిర్మించి ప్రయాణికులను నిర్దేశించిన గమ్యాలకు చేర్చేలా నిర్మాణం చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ మార్గాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి త్వరితగతిన పనులు చేపడితే రెండు మార్గాలకు మహర్దశ పట్టనుంది.