సీఎం రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని తాజ్కృష్ణలో కుల జన గణన, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంపుపై తెలంగాణ బీసీ మేధావుల ఫోరం సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో మాట్లాడిన తీన్మార్ మల్లన్న.. కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీల పరంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ.. బీసీల కోసం అందరం ఒక్కతాటిపై నిల్చుంటామని తీన్మార్ మల్లన్న స్పష్టంచేశారు. తాను ఎమ్మెల్సీగా గెలవడానికి కారణం బీసీలు పెట్టిన భిక్షేనని.. వాళ్ల కోసం అవసరమైతే ఎమ్మెల్సీ పదవిని కూడా వదిలేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తీన్మార్ మల్లన్న.
తనకు బీసీలే ముఖ్యమని.. మంత్రి పదవి ఇచ్చినా తీసుకోనంటూ మల్లన్న తెలిపారు. బీసీల కులగణనకు జానారెడ్డి లాంటి సీనియర్ నేతలు అడ్డుపడుతున్నట్టు చెప్పుకొచ్చారు. సెక్రటేరియట్లో నిర్వహించిన కులగణన సమావేశానికి తనను కూడా పిలిచారని పేర్కొన్న మల్లన్న.. అందులో పాల్గొన్న జానారెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు మినహాయిద్దామని జానారెడ్డి అన్నట్టు తెలిపారు. కానీ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని.. మేనిఫెస్టోలో 16వ పేజీలోని పేరా ఒకటిలోనే చెప్పామని గుర్తుచేసినట్టు వివరించారు. మరి సుప్రీం కోర్టు ఒప్పుకోవట్లేదని సాకులు చెప్తున్నారని మండిపడ్డారు.
బీసీల రిజర్వేషన్ల కోసం డాక్టర్ వినయ్ సుప్రీం కోర్టు వరకు వెళ్లి ఇప్పటికీ పోరాడుతున్నట్టు మల్లన్న పేర్కొన్నారు. అయితే.. ఈ రిజర్వేషన్లు ఇవ్వొద్దని స్వప్నా రెడ్డి కేసు వేసినట్టు తెలిపారు. ఆమెతో పిటిషన్ దాఖలు చేపించిందే.. జానారెడ్డేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలు ఏమీ పసిగట్టట్లేదనుకుంటున్నారని.. కానీ తాము అన్ని పసిగడుతున్నామని.. ఏం చేయాలో అది చేస్తామంటూ హెచ్చరికలు చేశారు.
మరోవైపు.. రాష్ట్ర అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవుల్లో బీసీలు ఎవ్వరూ లేరని.. వాళ్లకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఓ రిప్రజెంటేషన్ చేసినట్టు వివరించారు. అందుకు.. సమాధానంగా తనకు ఇచ్చే ఇంట్రెస్ట్ లేదని ముఖం మీదే చెప్పినట్టుగా తెలిపారు. అంటే.. బీసీల ఓట్లు కావాలి.. బీసీలు పెట్టే పదవుల బిక్ష కావాలి కానీ.. బీసీలకు మాత్రం అవకాశాలు ఇవ్వారా.. ఇదెక్కడి అన్యాయం అంటూ రేవంత్ రెడ్డిని మల్లన్న ప్రశ్నించారు.
కుల గణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డికి తీన్మార్ మల్లన్న సూచించారు. ఇది రాహుల్ గాంధే చెప్పినట్టు గుర్తుచేశారు. ఒకవేళ ఇది జరగకుంటే అగ్నిగుండం సృష్టిస్తామని తీన్మార్ మల్లన్న హెచ్చరించారు. కార్యక్రమంలో.. మాజీ స్పీకర్ మధుసూదన చారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బండ ప్రకాష్, వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.