ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంబైలో టాటా స‌న్స్ చైర్మ‌న్ ఎం. చంద్ర‌శేఖ‌ర‌న్‌తో మంత్రి నారా లోకేశ్ భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 09, 2024, 09:54 PM

అందాల విశాఖ సాగ‌ర‌తీరంలో టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీస్ మ‌ణిహారంగా మెర‌వ‌నుంది. మెరుగైన జీత‌భ‌త్యాలు అందిస్తూ... 10 వేల ఐటీ ఉద్యోగాలు యువ‌త‌కు ల‌భించ‌నున్నాయి. యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో యువ‌నేత, మంత్రి నారా లోకేశ్ ఏపీకి ప్ర‌ఖ్యాత ఐటీ కంపెనీలను ర‌ప్పించి ల‌క్ష‌లాది మందికి స్థానికంగా ఉపాధి క‌ల్పిస్తాన‌ని మాటిచ్చారు. ఇచ్చిన మాట నెర‌వేర్చే దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేసి టాటా గ్రూప్ చైర్మ‌న్‌, పెద్ద‌ల‌ను ఒప్పించి విశాఖ‌కు టీసీఎస్‌ని ర‌ప్పించారు. ముంబై మ‌హాన‌గ‌రంలోని టాటా స‌న్స్ ఆఫీస్ బాంబే హౌస్‌లో టాటా స‌న్స్ చైర్మ‌న్ ఎం. చంద్ర‌శేఖ‌ర‌న్‌తో నిన్న ఏపీ ఐటీ, ఎల‌క్ట్రానిక్స్, మాన‌వ‌వ‌న‌రుల శాఖ మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. ఈ స‌మావేశంలో సీఎంవో అడిష‌నల్ సెక్ర‌ట‌రీ కార్తికేయ మిశ్రా, టాటా గ్రూప్ అధికారులు పాల్గొన్నారు.ఏపీ ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న సౌక‌ర్యాలు, విశాఖ‌లో ఐటీ అభివృద్ధికి తీసుకుంటున్న చ‌ర్య‌లను మంత్రి లోకేశ్ వారికి వివ‌రించారు. త‌మ టీసీఎస్ సెంట‌ర్‌ను విశాఖ‌లో నెల‌కొల్పుతామ‌ని, 10 వేల ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని టాటా గ్రూప్ ప్ర‌క‌టించింది. ఏపీలో ఈవీ, ఎయిరో స్పేస్‌, స్టీల్, హోట‌ల్స్, టూరిజం రంగాల్లో పెట్టుబ‌డులు పెట్టే అవ‌కాశాలు ప‌రిశీలిస్తామ‌ని మంత్రి నారా లోకేశ్‌కు టాటా గ్రూప్ తెలిపింది.టీసీఎస్ ఏర్పాటుపై మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ విశాఖ‌లో ఏర్పాటు చేసి 10,000 మందికి ఉద్యోగాలు క‌ల్పించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ఏపీ ప్ర‌ఖ్యాత కంపెనీల‌ను స్వాగతిస్తోందని తెలిపారు. ఐటీ, ఎల‌క్ట్రానిక్స్, పారిశ్రామికాభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబ‌ర్ వ‌న్‌గా నిలిపేందుకు టీసీఎస్ వంటి ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత కంపెనీ పెట్టుబ‌డి తొలి అడుగు కానుంద‌ని హ‌ర్షం వ్యక్తం చేశారు.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో దూసుకెళ్తామ‌ని ఇటీవ‌ల సీఎం చంద్ర‌బాబు ప్రకటించారు. సీఎం ఆదేశాల‌తో, తాను యువ‌త‌కి-రాష్ట్ర ప్ర‌జ‌ల‌కి ఇచ్చిన మాట మేర‌కు మంత్రి నారా లోకేశ్ ప్ర‌ఖ్యాత కంపెనీల‌ను ర‌ప్పించేందుకు ప్ర‌య‌త్నాలు చేసి విజ‌య‌వంతమయ్యారు. లులూ, ఒబెరాయ్‌, బ్రూక్ ఫీల్డ్‌, సుజ‌లాన్ ఇప్ప‌టికే ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఇప్పుడు లోకేశ్ ఐటీ అభివృద్ధిలో గేమ్ ఛేంజ‌ర్ కానున్న టాటా గ్రూప్‌ని ఒప్పించి... మెప్పించి టీసీఎస్ ర‌ప్పించారు. టీసీఎస్ రాక‌తో ఐటీ హ‌బ్‌గా విశాఖ‌... ప్ర‌ఖ్యాత కంపెనీల పెట్టుబ‌డుల‌కు గ‌మ్య‌స్థానంగా ఆంధ్రప్రదేశ్ మారనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com