చారిత్రాత్మక చార్మినార్ కు చెందిన 135 ఏళ్ల చరిత్రకు గాయమైంది. కాలం మారినా చెక్కుచెదరకుండా ఉన్న గడియారం పగిలిపోయింది. అదేనండి.. హైదరాబాద్ అనగానే మనసులో మెదిలే చారిత్రక కట్టడం, షహర్కా షాన్ అని ముద్దుగా పిలుచుకునే చార్మినార్కు ఉన్న గడియారం పగిలిపోయింది. ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా.. కుతుబ్ షాహీ వంశానికి చెందిన ఐదవ పాలకుడు ముహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో ఈ చార్మినార్ నిర్మించినట్టు చరిత్ర చెప్తోంది. అయితే.. 135 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ చార్మినార్కు గత ప్రభుత్వ హయాం నుంచే రిపేర్లు చేస్తున్నారు. అయితే.. చార్మినార్కు నాలుగు వైపులా గడియారాలు ఉండగా.. మరమ్మతు పనుల్లో భాగంగా నిన్న (జులై 29న) తూర్పు వైపున ఉన్న గడియారం ధ్వంసమైంది.
మరమ్మతుల కోసం ఏర్పాటు చేసిన ఇనుప పైప్లు తీస్తున్న సమయంలో.. అనుకోకుండా గడియారానికి తగిలాయి. దీంతో గడియారంలోని డయల్ బోర్డు పగిలిపోయింది. అయితే.. కొన్ని సోర్సుల ప్రకారం పావురాల వల్లే ఈ డ్యామేజ్ జరిగిందని తెలుస్తోంది. ఎలా జరిగినప్పటికీ.. గడియారం పాక్షికంగా ధ్వంసమైనా.. పనిచేస్తూ సరైన సమయాన్ని సూచిస్తుండటం గమనార్హం. ఈ విషయాన్ని గమనించిన ఆర్కియాలజీ విభాగం రిపేర్లు చేపట్టింది. డయల్ బోర్డు కొత్తది ఏర్పాటు చేయడం కొంచెం కష్టమైన పని కావటంతో.. దెబ్బతిన్న దగ్గరే మరమ్మతులు చేస్తున్నారు ప్రారంభించారు. చార్మినార్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గడియారం పగిలిపోవడంతో.. అధికారులు అప్రమత్తమై భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.
చార్మినార్ అంటే.. కేవలం తెలంగాణలోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో ఐకానిక్ చారిత్రాత్మనక కట్టడంగా పేరుపొందింది. చార్మినార్కు మాత్రమే కాదు.. దాని మీదున్న గడియారాలకు కూడా ప్రత్యేక చరిత్ర ఉంది. చార్మినార్కు నాలుగు మినార్లే కాదు... నాలుగు వైపులా గడియారాలు కూడా ఉంటాయి. 1889లో చార్మినార్కు నలువైపులా గడియారాలను అమర్చారు. ఈ గడియారాలను నాటి పాలకులు లండన్ నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్నారు. నేటికీ ఆ గడియారాలు సమయాన్ని సక్రమంగా తెలియజేస్తున్నాయంటే ఎంత విశిష్టమైనవో అర్థం చేసుకోవచ్చు. ప్రతి 24 గంటలకు ఒకసారి గడియారాలకు కీ ఇస్తుంటారు. ఈ గడియారాలను అప్పట్లోనే ఎంతో పేరు పొందిన వాహిద్ వాచ్ కంపెనీ తయారు చేసింది. గడియారం దెబ్బతినటంతో.. 135 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న ఈ పురాతన గడియారం ప్లేస్లో కొత్తది అమర్చుతారా? లేక దానికే రిపేర్ చేస్తారా అన్న సందేహం పలువురిలో నెలకొంది. అయితే.. ఆ సందేహాన్ని నివృత్తి చేస్తూ.. ఆర్కియాలజీ విభాగం.. ఉన్న దానికే రిపేర్లు చేపట్టింది.