మొబైల్ ఫోన్ల రికవరీలో దేశంలోనే తెలంగాణ పోలీసులు రెండో స్థానంలో నిలిచారు. 2024 జనవరి 1 నుంచి 2024 జూలై 25 వరకు కేవలం 7 నెలల వ్యవధిలోనే.. 21 వేల 193 మొబైల్స్ను విజయవంతంగా రికవరీ చేసి.. దేశంలో రెండో స్థానంలో నిలిచి సత్తా చాటారు. మొబైల్ ఫోన్ల దొంగతనాలను అరికట్టడానికి.. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DOT) సీఈఐఆర్ పోర్టల్ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఈ పోర్టల్ను అధికారికంగా 2023 మే 17న దేశవ్యాప్తంగా ప్రారంభించగా... తెలంగాణలో 2023 ఏప్రిల్ 19 నుంచి ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది.
అయితే.. తెలంగాణలో సీఈఐఆర్ పోర్టల్కు నోడల్ ఆఫీసర్గా సీఐడీ అదనపు డీజీపీ శిఖా గోయెల్ను నియమించారు. రాష్ట్రంలో ఉన్న 780 పోలీస్ స్టేషన్లు ఈ పోర్టల్ను ఉపయోగిస్తున్నాయి. 2024లో 206 రోజుల్లో 21,193 పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను రికవరీ చేయడంలో పోలీసులు విజయం సాధించారు. గత 8 రోజుల్లోనే ఏకంగా 1000 ఫోన్లను రికవరీ చేసి.. వాటిని ఫిర్యాదుదారులకు అప్పగించటం గమనార్హం. ప్రతిరోజు సగటున 82 మొబైల్లను రికవరీ చేస్తున్నారు.
ముఖ్యగా.. 189 రోజుల్లో 10,000 మొబైల్లు, 291 రోజుల్లో 20,000 మొబైల్లు, 395 రోజుల్లో 30,000 మొబైల్లు, 459 రోజుల్లో 37,000 మొబైల్లు రికవరీ చేసి.. తెలంగాణ పోలీసులు రికార్డు సృష్టించారు. రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3808, తరువాత రాచకొండ కమిషనరేట్ పరిధిలో 2174, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2030 మొబైల్ పరికరాలను రికవరీ చేశారు.
తెలంగాణ పౌరులకు మరింత సులభంగా, మెరుగ్గా సేవలు అందించడానికి, తెలంగాణ పోలీసులు టెలికాం శాఖ (డీవోటీ) తో కలిసి సీఈఐఆర్ పోర్టల్ను తెలంగాణ పోలీస్ సిటిజన్ పోర్టల్తో అనుసంధానించారు. పోగొట్టుకున్న లేదా చోరీ అయిన మొబైల్ పరికరాల గురించి రిపోర్ట్ చేయడానికి ప్రజలు www.tspolice.gov.in లేదా www.ceir.gov.in వెబ్సైట్లను ఉపయోగించవచ్చు.
సీఈఐఆర్ పోర్టల్ ప్రారంభమైనప్పటి నుంచి.. తెలంగాణ పోలీసుల ఫ్రెండ్లీ పోలీసింగ్లో ఇదోక కార్యక్రమంగా మారింది. మొబైల్ ఫోన్లు కోల్పోయిన వ్యక్తులకు ఇది ఒక ఆశాదీపంగా మారింది. అనేక మంది వినియోగదారుల నుంచి వచ్చిన టెస్టిమోనియల్లు పోర్టల్ ప్రభావాన్ని, పోగొట్టుకున్న ఫోన్లను తిరిగి పొందడంలో ఇది చూపిన సానుకూల ప్రభావాన్ని ధృవీకరిస్తున్నాయి.