ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొడంగల్‌లో పోటీ చేస్తే గెలిపిస్తా,,,అక్బరుద్దీన్ ఒవైసీకి రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 27, 2024, 07:32 PM

తెలంగాణ అసెంబ్లీలో నేతల కామెంట్లు, కౌంటర్లతో బడ్జెట్ సమావేశాలు వాడీ వేడీగా సాగుతున్నాయి. అధికార ప్రతిపక్ష నేతలకు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బడ్జెట్ మీద జరుగుతున్న చర్చ సందర్భంగా.. అధికర పక్షం మొత్తం ఒకవైపు, ప్రతిపక్ష పార్టీ నుంచి హరీష్ రావు ఒకవైపుగా మాటల యుద్ధమే నడిచింది. సభ మొత్తం హాట్ హాట్‌గా జరుగుతున్న వేళ.. ఓ ఇంట్రెస్టింగ్ సన్నివేశం చోటుచేసుకుంది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి, సీఎం రేవంత్ రెడ్డికి మధ్య అసక్తికర సంభాషణ జరిగింది.


హైదరాబాద్‌లో మెట్రో విస్తరణ పనులపై మాట్లాడిన అక్బరుద్దీన్ ఒవైసీ.. పాతబస్తీకి మెట్రో (Old City Metro) రైలును విస్తరించాలని డిమాండ్ చేశారు. తమతో తొమ్మిదేళ్ల పాటు కలిసి ఉన్న కేటీఆర్.. తెస్తున్నాం.. తెస్తున్నామంటూ టైంపాస్ చేశారు తప్ప.. ముందడుగు వేయలేదని అసహనం వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్‌కు మెట్రో కావాలని తానే డిమాండ్ చేశానని.. ఆయనతో కలిసి ఢిల్లీకి కూడా వెళ్లినట్లు వివరించారు. చివరకు పోరాడి తీసుకొచ్చామని.. కానీ తన ప్రాంతంలోనే ఇప్పుడు మెట్రో సేవలు లేవని.. ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదు అంటూ అక్బరుద్దీన్ చెప్పుకొచ్చారు.


ఈ క్రమంలో.. అక్బరుద్దీన్ ఒవైసీకి సమాధానం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. పాతబస్తీ మెట్రోకే ఎక్కువ నిధులు కేటాయించామన్నారు. నాలుగేళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో అదే మెట్రోలో వచ్చి పాతబస్తీలో ఓట్లు అడుగుతామని తెలిపారు. వీలైతే.. పాతబస్తీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని అక్బరుద్దీన్‌ను రిక్వెస్ట్ చేస్తామని చెప్పుకొచ్చారు. అలా అయితే.. మరి నా పరిస్థితేంటని అక్బరుద్ధీన్ ప్రశ్నించగా... అసెంబ్లీ సాక్షిగా బంపర్ ఆఫర్ ఇచ్చారు.


అక్బరుద్దీన్ ఒవైసీని కాంగ్రెస్ బీ ఫామ్‌పై కొడంగల్ నియోజవర్గం నుంచి పోటీ చేస్తే.. గెలిపించే బాధ్యత తాను తీసుకుంటానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. చీఫ్ ఎన్నికల ఏజెంట్‌గా ఉండి అక్బరుద్దీన్‌ను గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. తాను పోటీ కూడా చేయనని చెప్పుకొచ్చారు. వచ్చే సభలో.. అక్బరుద్దీన్‌ను డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి.. తన పక్కనే కూర్చోబెట్టుకుని.. కేటాయింపులు తనతోనే చెపిస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆఫర్‌పై స్పందించిన అక్బరుద్దీన్ ఒవైసీ.. తన పార్టీలో తాను సంతోషంగానే ఉన్నానని తెలిపారు. కొండగల్ నుంచి పోటీ చేసే ఆసక్తి లేదని స్పష్టం చేశారు. పాతబస్తీలో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు తక్కువ ఓట్లు వచ్చాయో దానిపై దృష్టి పెట్టాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 12 నుంచి 15 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని ఆశించానని.. కానీ 8కే పరిమితం అయ్యారని.. అందుకు కారణాలేంటో బేరీజు వేసుకోవాలని రేవంత్ రెడ్డికి సూచించారు. రేవంత్ రెడ్డి తనకు నిజమైన మిత్రుడంటూ చెప్పుకొచ్చారు అక్బరుద్దీన్ ఒవైసీ.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com