ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 26, 2024, 10:08 PM

రాష్ట్రంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ తొలిసారిగా.. నిన్న (జులై 25న) అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కాగా.. ఈ బడ్జెట్‌పై రేపు (జులై 26న) చర్చ చేపట్టనున్నారు. కాగా.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అయితే.. బడ్జెట్‌పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ఖండించారు. ఇప్పుడే ఇలా ఉంటే.. మరి రేపు చర్చ సమయంలో అసెంబ్లీలో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది.


ఈ క్రమంలో.. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో గులాబీ బాస్ కేసీఆర్ అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేశారు. రేపు అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సడెన్ మీటింగ్ పెట్టటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే.. ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌లో జరిగిన ఈ సమావేశంలో.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌ మీద అసెంబ్లీలో చేపట్చనున్న చర్చ సందర్భంగా.. అనుసరించాల్సిన వ్యూహాలను పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్టు సమాచారం.


బడ్జెట్‌లో ఏ అంశాన్ని లేవనెత్తినా.. అధికార పార్టీని అసెంబ్లీ వేదికగానే ఇరుకున పెట్టాలని నేతలకు కేసీఆర్ సూచించినట్టు సమాచారం. ఏ అంశం లేవనెత్తినా.. ఎలా కార్నర్ చేయాలి.. ప్రభుత్వ విమర్శలకు ఎలా కౌంటర్ ఇవ్వాలన్న అంశాలపై దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ పర్యటనకు వెళ్లగా.. అందుకు సంబంధించిన అంశాలపైన కూడా కేసీఆర్ ఆరా తీసినట్టు తెలుస్తోంది.


అసెంబ్లీ సమావేశాలకు ముందే తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ నిర్వహించిన కేసీఆర్.. బడ్జెట్ మీద చర్చకు ముందు మరోసారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ కావటం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే.. అసెంబ్లీలో బడ్జెట్‌పై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరగనుంది. అయితే.. బడ్జెట్‌ రోజు సమావేశాలకు హాజరైన కేసీఆర్.. చర్చకు కూడా హాజరవుతారా లేదా అన్నది శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ కేసీఆర్ చర్చకు వస్తే.. సమావేశాలు రసవత్తరంగా ఉంటాయని అందరూ భావిస్తున్నారు.


కానీ.. సడెన్‌గా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారంటే.. కేసీఆర్ రేపు సమావేశాలకు రావట్లేదా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. కేసీఆర్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదాలో ప్రభుత్వాన్ని తనదైన శైలిలో నిలదీస్తే చూడాలని ఆయన అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు ఎంతగానో ఎదురుచూస్తుండగా.. ఇప్పుడు ఈ మీటింగ్ జరగటంతో శ్రేణులకు మళ్లీ నిరాశే మిగలనుందా అన్న చర్చ నడుస్తోంది. మరి బడ్జెట్ చర్చలో కేసీఆర్ పాల్గొంటారా లేదా డుమ్మా కొడతారా అన్నది రేపటివరకు వేచి చూడాల్సిందే..!










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com