ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఎలాంటి ఆధారాలు లేవు, బెయిల్‌కు కవిత అర్హురాలు'.. మే 2కు కోర్టు తీర్పు రిజర్వ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 22, 2024, 07:47 PM

దేశంలోనే సంచలనం సృష్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కా కేసులో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. ఈ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉండగా.. నేడు బెయిల్ పిటిషన్‌ మీద రౌజ్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. అయితే.. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. మే 2వ తేదీకి తీర్పును రిజర్వ్ చేసింది. అయితే.. బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో అటు కవిత తరపు న్యాయవాదులు, ఇటు సీబీఐ తరపు లాయర్ల మధ్య వాడీవేడీగా వాదనలు జరిగినట్టు తెలుస్తోంది.


ఒక మహిళగా కవిత.. పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్‌కు అర్హురాలని ఆమె తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అరెస్ట్ నుంచి విచారణ వరకు ఎటువంటి మెటీరియల్ లేదని న్యాయస్థానానికి వివరించారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండానే కవితను అరెస్ట్ చేశారని చెప్పుకొచ్చారు. ఈడీ కస్టడీలో ఉన్న సమయంలోనే.. సీబీఐ ఎందుకు అరెస్ట్ చేసిందని ప్రశ్న లేవనెత్తారు. అరెస్ట్ చేయాల్సిన అవసరం లేనప్పటికీ.. అరెస్టు చేశారని కోర్టుకు వివరించారు. బీఆర్ఎస్ పార్టీకి కవిత.. స్టార్ క్యాంపైనర్‌గా ఉన్నారని ధర్మాసనానికి న్యాయవాది తెలిపారు. గతంలో జరిగిన చిదంబరం కేసులోని తీర్పు.. కవిత విషయంలో కూడా సరిగ్గా సరిపోతుందని ప్రస్తావించారు. ఏడేళ్ల లోపల శిక్ష పడే కేసులకు అరెస్ట్ అవసరం లేదని ధర్మాసనానికి.. కవిత తరపున న్యాయవాది గుర్తు చేశారు.


ఇదిలా ఉంటే.. ఈ కేసులో కవితకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ వాదించింది. కేసు దర్యాప్తును కవిత ప్రభావితం చేయగలుగుతారని ధర్మాసనానికి వివరించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత కీలక వ్యక్తిగా ఉన్నారని.. బెయిల్‌ ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయంటూ వాదించింది. సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశం కూడా ఉందని చెప్పింది. లిక్కర్‌ కేసులో కవిత కింగ్‌ పిన్‌ అని మరోసారి చెప్పుకొచ్చిన సీబీఐ.. బెయిల్‌ ఇవ్వొదని గట్టిగానే వాదించింది. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును మే 2వ తేదీకి రిజర్వ్ చేసింది. దీంతో.. ఏం జరగనుందోనని బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


అయితే.. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేయగా.. జ్యుడీషల్ ఖైదీగా తీహార్ జైల్‌లో ఉన్న సమయంలోనే.. ఏప్రిల్‌ 11వ తేదీన సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత ప్రస్తుతం జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. అయితే.. ఇప్పుడు రెండు కేసుల్లో కవిత బెయిల్ కేసం పిటిషన్లు వేయగా.. ప్రతిసారి నిరాశే ఎదురవుతోంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com