ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చిన ఏపూరి సోమన్న.. తిట్టిన నోటితోనే పొగిడి.. ఇప్పుడు మళ్లీ..!

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 15, 2024, 07:16 PM

అంతన్నాడింతన్నాడు.. ఇంతలో ఏమైందో తెలియదు.. మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరిపోయాడు ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల వేళ అందరినీ మరోసారి విస్మయానికి గురి చేస్తూ.. బీఆర్ఎస్‌ను వీడి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఏపూరి సోమన్న. హైదరాబాద్‌లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో సోమన్న కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో.. ఏపూరి సోమన్న మరోసారి చర్చనీయాంశంగా మారాడు.


తెలంగాణ మలిదశ ఉద్యమంలో.. టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమాల్లో తన పాటతో యువతను ఉత్తేజపరిచిన ఏపూరి సోమన్న.. ఆ తర్వాత వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం పాలన నచ్చక.. కేసీఆర్ కుటుంబంపై వ్యతిరేకంగా పాటలు పాడారు. "ఎవనిపాలైందిరో తెలంగాణ.. ఎవడేలుతున్నడురో తెలంగాణ" అంటూ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారందరి గొంతుకగా మారాడు. ఈ క్రమంలోనే.. ప్రజాగాయకునిగా ఉన్న ఏపూరి సోమన్న.. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షునిగా ఎన్నికైన సమయంలో కాంగ్రెస్‌లో కొంత యాక్టివ్‌గా పని చేశారు.


ఆ తర్వాత.. వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీలో చేరి ఆమెకు రైట్ హ్యాండ్‌గా మారారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ తరపున ప్రకటించిన మొదటి అభ్యర్థి కూడా ఏపూరి సోమన్నే కావటం గమనార్హం. కాగా.. ఆ తర్వాత జరిగిన పరిణామాల మధ్య షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేయటంతో.. సోమన్న కూడా తన రాజకీయ భవిష్యత్తు చూసుకున్నారు.


అప్పటివరకు కల్వకుంట్ల కుటుంబంపై వ్యతిరేకంగా గొంతెత్తిన ఏపూరి సోమన్న.. అందరికీ షాక్ ఇస్తూ గులాబీ కండువా కప్పుకుని బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అంతే కాదు.. తెలంగాణకు ప్రత్యామ్నాయం, పర్యాయపదం కేసీఆరేనని తన అనుభవంతో తెలుసుకున్నానని పెద్ద స్టేట్‌మెంటే ఇచ్చారు సోమన్న. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మీద, బీఆర్ఎస్ తరపున అదిరిపోయే పాటలు పాడి.. తనవంతు ప్రచారాన్ని చేశారు. ఈక్రమంలో.. సోమన్నపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎవనిపాలైందిరో తెలంగాణ అన్న పాట ఎవని పాలైంది అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత అంతా సద్దుమణిగింది.


ఇంతవరకు బాగానే ఉన్నా.. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సోమన్న కాంగ్రెస్‌లో చేరటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే.. మొన్నటివరకు తెలంగాణకు పర్యాయపదం కేసీఆర్ అని స్టేట్మెంట్ ఇచ్చి విమర్శలు ఎదుర్కొన్న సోమన్న.. ఇప్పుడు మళ్లీ ఆయనపై విమర్శలు ఎక్కుపెట్టేందుకు సిద్ధమవటం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com