ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల వేళ.. ముగ్గురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 29, 2023, 09:47 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. పోలీసు ఉన్నతాధికారులపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. ఎన్నికల విధుల్లో పక్షపాతం చూపించారని ముగ్గురు పోలీసు అధికారులను ఈసీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ పరిధిలో నగదు పట్టుబడిన వ్యవహారంలో పక్షపాతం చూపించారన్న ఆరోపణలతో.. డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ యాదగిరి, సీఐ జహంగీర్‌లను విధుల నుంచి ఈసీ తప్పించింది. ఈ ముగ్గురు పోలీసు అధికారులపై.. శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతి కుమారికి ఈసీ లేఖ రాసింది.


ఎన్నికల తనిఖీల్లో భాగంగా ముషీరాబాద్‌లోని సంతోష్‌ ఎలైట్‌ అపార్ట్‌మెంట్‌లో సుమారు రూ.18 లక్షల నగదు, చెక్‌బుక్‌, 2 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదు ముషీరాబాద్‌ బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్‌ కుమారుడు ముఠా జై సింహకు చెందినదిగా పోలీసులు గుర్తించగా.. ఎఫ్‌ఐఆర్‌లో మాత్రం నిందితుల వివరాలు గుర్తుతెలియనివారిగా పేర్కొనటం గమనార్హం. ఈ కేసులో ముఠా జై సింహను కాకుండా ముఠా గోపాల్‌ స్నేహితులు సంతోష్‌, సుధాకర్‌ను అరెస్టు చేశారు.


అయితే.. అసలైన నిందితులను అరెస్టు చేయకుండా.. సరైన సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఈసీ గుర్తించింది. దీంతో.. ముషీరాబాద్‌ సీఐ జహంగీర్‌, చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, సెంట్రల్‌ జోన్‌ డీసీపీ వెంకటేశ్వర్లను సస్పెండ్ చేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. సీఐ జహంగీర్‌ స్థానంలో ముషీరాబాద్ స్టేషన్‌లో పనిచేస్తున్న డీఐ వెంకట్‌ రెడ్డిని నియమించినట్లు హైదరాబాద్‌ సీపీ సందీప్‌ శాండిల్య ప్రకటించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com