ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణ ఎన్నికల పోలింగ్.. హైకోర్టులో టీచర్ సంఘాల పిటిషన్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 29, 2023, 07:03 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. ఇప్పటికే పోలింగ్‌కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే పోలింగ్ వేళ.. తెలంగాణ హైకోర్టులో టీచర్ సంఘాల పిటిషన్ దాఖలు చేశాయి. తమకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించాలని కోరుతూ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఫారం 12 సబ్మిట్ చేసినా పోస్టల్ బ్యాలెట్‌ అవకాశం కల్పించలేదని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల డ్యూటీలో ఉన్న తమకు పోస్టల్ బ్యాలెట్ ఇప్పటి వరకు అందలేదని పిటిషన్‌లో టీచర్ సంఘాలు పేర్కొన్నాయి. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించాలని కోరారు.


ప్రస్తుతం ఈ ఎన్నికల్లో తొలిసారిగా 13 శాఖల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓటు సదుపాయాన్ని కల్పిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర సేవల్లో ఉండేవారికి, ఎన్నికల విధుల్లో ఉండే వివిధ విభాగాల వారికి కూడా ఈ సదుపాయాన్ని కల్పించింది. ఇందులో ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులతో పాటు ఎయిర్‌పోర్టు, రైల్వే, ఆల్ ఇండియా రేడియో, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, వైద్య ఆరోగ్య, రోడ్లు, భవనాలు, పౌరసరఫరాలు, అగ్నిమాపక శాఖ, మీడియా, విద్యుత్, బీఎస్‌ఎన్‌ఎల్, ఎఫ్‌సిఐ శాఖల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు కూడా ఇంటి నుంచే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించారు. అయితే చాలా మంది టీచర్లకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అందలేదు. దీంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఓటు అనేది ప్రాథమిక హక్కు అని.. అందరికీ ఓటు హక్కుపై అవగాహన కల్పించే తామే ఓటు వేయకపోవటం దారుణమన్నారు. ఫారం 12 సబ్మిట్ చేసినా పోస్టల్ బ్యాలెట్‌ అవకాశం కల్పించలేదని హైకోర్టును ఆశ్రయించారు. అయితే టీచర్ల పిటిషన్‌పై ఎన్నికల సంఘం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com