తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపు (నవంబర్ 30న) జరగనుంది. సాధారణంగా ఎన్నికలు పూర్తయిన వెంటనే అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ వైపు మళ్లుతుంది. ఎలక్షన్లకు ముందు సర్వేలు హడావిడి చేస్తే.. పోలింగ్ ముగిశాక ఎగ్జిట్ పోల్స్ సందడి చేస్తాయి. ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు.. విజయం ఎవరిని వరించనుంది.. అధికారంలోకి ఎవరొస్తారు.. ఇలాంటి ప్రశ్నల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ గురించి అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తారు. ఈ క్రమంలో అసలు ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి? వాటిని ఎలా నిర్వహిస్తారు ? ఎగ్జిట్ పోల్స్ కచ్చితత్వం ఎంత ? అనే విషయాల గురించి తెలుసుకుందాం.
ఎన్నికల్లో భాగంగా కొన్ని మీడియా సంస్థలతో పాటు మరికొన్ని ప్రత్యేక సంస్థలు ప్రిపోల్స్, ఎగ్జిట్ పోల్స్ నిర్వహిస్తుంటాయి. ప్రిపోల్స్ను పోలింగ్ జరగటానికంటే ముందు నిర్వహిస్తారు. ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు, పొత్తులు ఉంటాయో లేదో తేలక ముందు, సీట్ల సర్దుబాటుపై స్పష్టత రాకముందు, పార్టీలు/కూటములు అభ్యర్థులను ప్రకటించక ముందు, పోలింగ్ తేదీకి చాలా రోజుల ముందు, లేదా పోలింగ్ తేదీ సమీపించినప్పుడు నియోజకవర్గాల వారీగా కొంతమంది ఓటర్లను ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకుని ప్రిపోల్స్ నిర్వహిస్తారు. నియోజకవర్గ ఓటర్లతో మాట్లాడి.. ఏ పార్టీకి విన్నింగ్ ఛాన్స్ ఉందనే విషయాన్ని సేకరించి పోల్ రిజల్ట్ వెల్లడిస్తారు. ఎగ్జిట్ పోల్స్ అలా కాదు. పోలింగ్ రోజే ఓటరు మనోగతం తెలుసుకుంటూ సర్వే నిర్వహిస్తారు.
ఓటింగ్ జరిగేటప్పుడు ఎగ్జిట్ పోల్ నిర్వహిస్తారు. సెలెక్ట్ చేసిన పోలింగ్ కేంద్రాలకు ఆయా సంస్థల ప్రతినిధులను పంపి ఎక్కువమంది ఏ పార్టీకి ఓటు వేస్తారో ఒక అంచనాకు వస్తారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో సేకరించిన సమాచారంతో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ఓ అంచనాకు వస్తారు. ప్రిపోల్ సర్వేలో ఎవరిని ప్రశ్నించాలనేది నిర్వాహకులు ముందే నిర్ణయించుకుంటారు. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, యువత, వికలాంగులు, వృద్ధులు, మహిళలు, కులం, మతం, పేదలు, మధ్యతరగతి ఇలా వివిధ వర్గాల వారీగా ఓటర్లను ఎంచుకొని సర్వే చేస్తారు. కానీ ఎగ్జిట్పోల్లో అలా కాదు. పోలింగ్ రోజే.. ఓటింగ్లో పాల్గొన్నవారినే ప్రశ్నించి సమాచారం సేకరిస్తారు.
ప్రిపోల్ సర్వేలతో పోలిస్తే ఎగ్జిట్ పోల్స్లో కచ్చితత్వానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎగ్జిట్ పోల్ అంచనాలు రిజల్ట్కు దాదాపు దగ్గరగా ఉంటాయి. పోలింగ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతుంది. ఎగ్జిట్ పోల్ నిర్వాహకులు దాదాపు అన్ని వర్గాల ఓటర్లు కవర్ అయ్యేలా వేర్వేరు సమయాల్లో ఓటర్ల స్పందనను తెలుసుకుంటారు. కానీ ఈ ప్రక్రియను ఎంత ఎక్కువ మంది పకడ్బందీగా, విస్తృతంగా నిర్వహిస్తేనే కచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికల జరగుతున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం రాష్ట్రాలకు పలు విడతల్లో పోలింగ్ జరగ్గా.. తెలంగాణకు ఈనెల 30న పోలింగ్ జరగనుండగా.. పోలింగ్ ఉదయం 7 నుంచి 5 గంటల వరకు సాగనుంది. పోలింగ్ ముగిసిన గంట తర్వాత అంటే సాయంత్రం 6 గంటలకు ఆయా సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు విడుదల చేస్తాయి.