మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న అప్పన్నపల్లె రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ని జూన్ నెల వరకు పూర్తి చేసి ప్రారంభిస్తామని తెలంగాణ రోడ్లు భవనాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెప్పారు. సోమవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి మరియు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభానికి వెళ్తూ మధ్యలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆర్ అండ్ బి ద్వారా చేపట్టిన పలు కార్యక్రమాలను మంత్రి తనిఖీ చేశారు. ముందుగా అప్పన్నపల్లి రెండవ రైల్వే ఓవర్ బ్రిడ్జిని పరిశీలిస్తూ కేవలం 12 నెలల్లోనే దీనిని పూర్తి చేయడం పట్ల రాష్ట్రమంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ కృషి , పట్టుదల అర్థమవుతుందని అన్నారు.
అనంతరం ఆర్ అండ్ బి చౌరస్తాలో జంక్షన్ అభివృద్ధి పనులను సైతం మంత్రి తనిఖీ చేశారు. అశోక్ థియేటర్ చౌరస్తాలో చేపట్టిన రహనుమియా బ్రిడ్జి పనుల తనిఖీ చేసిన అనంతరం మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అప్పన్న పల్లి మొదటి ఆర్ ఓ బి ని 12 సంవత్సరాలలో నిర్మించగా 2 వ ఆర్ ఓ బి ని కేవలం 12 నెలల్లో నిర్మించడం పట్ల ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి బ్రిడ్జిని నిర్మించేందుకు కనీసం మూడు సంవత్సరాలు పడుతుందని , అలాంటిది వేగవంతంగా నిర్మాణం పూర్తి చేయడం పట్ల ఆయన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను అభినందించారు. జూన్ రెండు లోగా ఈ బ్రిడ్జి నిర్మాణం పనులను పూర్తి చేసి ఆరోబిని ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ ఆదనపు కలెక్టర్ కె. సీతారామారావు , మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ తదితరులు ఉన్నారు.