మహబూబ్ నగర్ నుండి రాయచూరు వెళ్లే 167వ జాతీయ రహదారిపై దేవరకద్ర పట్టణంలో 24 కోట్ల 67 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జిని రాష్ట్ర రహదారులు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర లో ప్రారంభించారు. అంతేకాక కోటి 27 లక్షల 50 వేల రూపాయల వ్యయంతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ దేవరకద్ర ఆర్ఓబి నిర్మాణం వల్ల ప్రయాణికులకు రైల్వే క్రాసింగ్ బాధ తప్పిపోయిందని , దీనివల్ల ప్రయాణికులకు ఎంతో సులభమైందని అంతేకాక సమయంఆదా అవుతుందని అన్నారు.
ముఖ్యంగా మహబూబ్ నగర్ -రాయచూరు వెళ్లేందుకు దేవరకద్ర రైల్వే క్రాసింగ్ వద్ద వాహనదారులు గంటలు గంటలు వేచి చూడాల్సి వచ్చేదని, ఆ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జి సోమవారం ప్రజలకు అందుబాటులోకి రావడం వల్ల ఈ జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి సులువుగా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ఎక్సైజ్ , క్రీడలు , సాంస్కృతిక, పర్యటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి , జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఆర్ అండ్ బిఈ ఈ స్వామి, మండల స్థాయి ప్రజాప్రతినిధులు , అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.