పెండింగ్ లో ఉన్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నింటిని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్ ఆదేశించారు. ముఖ్యంగా మహబూబ్ నగర్ పట్టణంలో ఇదివరకే చేపట్టి పురోగతిలో ఉన్న పనులన్నీటిని పూర్తి చేయాల్సిందిగా ఆయన జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా అధికారుల సమ్మిళిత సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే. తారక రామారావు జిల్లా సందర్శన సందర్భంగా పట్టణంలో చేపట్టిన కొన్ని పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేసుకోవడం జరిగిందని, ఇంకా వైకుంఠధామం, ఇంటిగ్రేటెడ్ వెజ్ , నాన్ వెజ్ మార్కెట్, కళాభారతి, తదితర పనులన్నీటిని ఈనెలాఖరువరకు పూర్తి చేయాలని ఆదేశించారు.
ముఖ్యంగా కళాభారతి పనులను నెలాఖరులోపు పూర్తి చేసి జూన్ 2 అక్కడే అన్ని కార్యక్రమాలు నిర్వహించుకునేలాగా పూర్తి చేయాలని ఆదేశించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల పనులు కొద్దిపాటి పెండింగ్లో ఉన్నాయని, అలాంటివాటిని పూర్తిచేయడంపై అధికారులు దృష్టి సారించాల్సిందిగా ఆయన కోరారు. ఈ విషయంపై నోడల్ అధికారులతో పాటు, స్పెషల్ అధికారులు కూడా దృష్టి సారించాలన్నారు. మంజూరైన పనులన్నీ ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లాలో చేపట్టిన ఆరోగ్య ఉప కేంద్రాల భవనాల నిర్మాణం పూర్తి చేయాలని, అదేవిధంగా క్రిస్టియన్ భవన్, హజ్ హౌస్, ఎంవి ఎస్ డిగ్రీ కళాశాలలో చేపట్టిన స్టేడియం పనులు పూర్తి చేయడంపై ఇంజనీరింగ్ అధికారులు సంబంధిత శాఖల అధికారులు దృష్టి సారించాలన్నారు.
ఇంకా ఎక్కడైనా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనట్లయితే తక్షణం ప్రారంభించాలన్నారు. ఆయిల్ పామ్ తోటల పెంపకానికి సంబంధించి రైతులు చేత డీడీలు చెల్లించేలా చూడాలని ఉద్యాన శాఖ అధికారిని ఆదేశించారు. ఈ- ఆఫీస్ లో ఎక్కువ రోజులు పెండింగ్లో ఉన్న అన్ని ఫైళ్లను తక్షణమే క్లోజ్ చేయాలని చెప్పారు. గ్రామపంచాయతీలలో వైకుంఠ దామాలకు నీరు, విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని డిపిఓ ను ఆదేశించారు. ఇంకా ఈ సమావేశంలో అర్బన్ హౌసింగ్ , ఇతర అంశాల పై సమీక్షించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామరావు, జిల్లా అధికారులు ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.