ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మణిపూర్ లో చిక్కుకుపోయిన తెలంగాణ విద్యార్థులు, కార్మికులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, May 07, 2023, 07:41 PM

ఈశాన్య రాష్ట్రం మణిపూర్ హింస ఘటనలో దాదాపు 54 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. ఆయన ఆ సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉందని అనధికార వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 200 మందికి పైగా పౌరులు గాయపడినట్లు తెలిసింది. రంగంలోకి దిగిన కేంద్ర బలగాలు ప్రధాన రహదారులు, కీలక ప్రాంతాల్లో భారీస్థాయిలో మోహరించాయి. బుధవారం నుంచి ఉద్రిక్తంగా మారిన మణిపుర్‌లో 10 వేల మంది సైన్యం, పారామిలిటరీ దళాలు పహారా కాస్తున్నాయి. ఇప్పటి వరకు 13వేల మందిని శిబిరాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.


ఇదిలా ఉండగా.. తెలంగాణకు చెందిన పలువురు మణిపురలో చిక్కుకున్నారు. 250 మంది విద్యార్థులు, కార్మికులు మణిపూర్‌లో చిక్కుకుపోయినట్లు తెలిసింది. వారు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడ చిక్కుకున్న విద్యార్థులను ఇంఫాల్ నుంచి హైదరాబాద్‌కు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రత్యేక విమానంలో వారిని ఇక్కడకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానం సోమవారం ఇంఫాల్ బయల్దేరి వెళ్లనుంది.


అయితే.. మణిపూర్‌లో జరిగిన హింసాత్మక ఘర్షణల్లో తెలంగాణకు చెందిన వారు ఎవరూ గాయపడలేదని, పుకార్లను నమ్మవద్దని తెలంగాణ పోలీసులు సూచించారు. మణిపూర్‌లో చిక్కుకున్న వారి కోసం హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇంఫాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చదువుతున్న తెలంగాణ విద్యార్థులు హెల్ప్‌లైన్‌కు డయల్ చేసి సహాయం కోరినట్లు పోలీసులు తెలిపారు. తెలంగాణ విద్యార్థులు మరియు కార్మికులను సురక్షితంగా ఇక్కడకు తీసుకొచ్చేందుకు మణిపూర్ ప్రభుత్వ అధికారులతో తెలంగాణ సీఎస్ శాంతి కుమారి, డీజీపీ సంప్రదింపులు జరపుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.


డీఐజీ సుమతి మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి ఎవరైనా మమ్మల్ని సంప్రదిస్తే.. ఆ సమాచారాన్ని ఆర్మీ, మణిపూర్ రాష్ట్ర పోలీసులకు తెలియజేస్తామని చెప్పారు. వారిని సురక్షితమైన ప్రదేశానికి తరలించడానికి చర్యలు చేపడతామని అన్నారు. వారిని తెలంగాణ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఆమె వెల్లడించారు. "తెలంగాణ విద్యార్థులు, కాంట్రాక్టర్ల ద్వారా వివిధ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న కార్మికులు సురక్షితంగా ఉన్నారు. వారు నివసించే ప్రదేశానికి దగ్గరగా ఉన్న ప్రదేశాలలో కాల్పులు జరుగుతున్నట్లు వార్తలు రావటం వారిని ఆందోళనకు గురిచేసింది. వారిలో కొందరు మాకు ఫోన్ చేసారు. ఆహారం ఏర్పాటు చేయమని అభ్యర్థించారు. మేం అక్కడి ప్రభుత్వ అధికారులతో మాట్లాడి వారికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అసరం లేదు. వారు సురక్షితంగా తెలంగాణకు చేరుకుంటారు." అని డీఐజీ సుమతి వెల్లడించారు.


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com