"నీది నాది ఒకటే కథ" ఫేమ్ వేణు ఉడుగుల డైరెక్షన్లో రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం విరాటపర్వం. నక్సలిజం నేపథ్యంలో సాగే హృదయవిదారకమైన ప్రేమ కథగా విరాటపర్వం సినిమా తెరకెక్కింది. 1990ల కాలంలో వరంగల్ లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలే ఈ సినిమాకు ప్రేరణ. షూటింగ్ ఎప్పుడో పూర్తయినా విడుదలకు సంవత్సరం పాటు వెయిట్ చేసింది విరాటపర్వం. ఎట్టకేలకు జూన్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి, సాయి పల్లవి నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు అందుతున్నాయి.
ముప్పై ఏళ్ళ క్రితం సరళ అనే యువతి జీవితంలో జరిగిన అనుకోని సంఘటనల సమాహారమే విరాటపర్వం. ఐతే, పూర్తిగా ఆమె జీవితాన్ని చూపించకుండా ఆమె పాత్ర తీరుతెన్నులను, ఆమె జీవితంలోని ముఖ్యమైన వ్యక్తులను తీసుకుని తనదైన శైలిలో, నక్సలిజం నేపథ్యంలో ఒక అందమైన ప్రేమ కథను వేణు ఉడుగుల తెరకెక్కించారని సురేష్ బాబు పేర్కొన్నారు.
సరళ అన్నయ్య మోహన్ రావు మాట్లాడుతూ... మొదటిసారి ఈ సినిమా ప్రస్తావన తనదగ్గరికొచ్చినప్పుడు, తెరపై తన చెల్లెలిని ఎలా చూపిస్తారోనని ఒకింత ఖంగారు పడ్డారట. వేణు స్టోరీకి సాయి పల్లవి, రానా, సురేష్ ప్రొడక్షన్స్ వంటి పెద్ద తారాగణం ఈ సినిమాకు జత కలవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని చెప్పారు. క్లయిమాక్స్ ను సరళ నిజ జీవితానికి విరుద్ధంగా చూపించారు కదా? అని విలేఖరి అడిగిన ప్రశ్నకు మోహన్ రావు నిజంగా ఏం జరిగిందో మీరు చూసారా? అసలేం జరిగిందో మాకు కూడా తెలియదు. అని సమాధానమిచ్చారు. విరాటపర్వం సినిమాను బట్టి తన చెల్లెలు సరళకు పోరాటం అంటే ఇష్టమని తెలిసిందని చెప్పారు. సినిమాలో రానా పోషించిన రవన్న నిజజీవిత పాత్ర శంకరన్న అంటే తమకు ఇష్టం లేదని, అతనే తన చెల్లెలు చనిపోవడానికి కారణమని, కాకపోతే, సినిమాలో మాత్రం ఇద్దరి మధ్య ప్రేమను చూపించారని చెప్పారు.