తెలుగు సినీ పరిశ్రమలో రూమర్లకు, కాంట్రావర్సీలకు దూరంగా ఉండే ఏకైక నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అయితే, తాజాగా మహేష్ చేసిన కొన్ని వ్యాఖ్యలు మాత్రం అనుకోకుండానే కాంట్రవర్సీ అవుతున్నాయి. బాలీవుడ్ నన్ను భరించలేదు... నన్ను భరించలేని పరిశ్రమలో అడుగు పెట్టి టైం వేస్ట్ చెయ్యదలచుకోలేదని మహేష్ అన్న మాటలపై జాతీయ మీడియాలో పలు చర్చలు కూడా జరుగుతున్నాయి. దీనిపై బాలీవుడు సెలెబ్రిటీలు ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు. ఎటువంటి వివాదాస్పద విషయంలోనైనా తన నిర్ణయాన్ని ముక్కుసూటిగా చెప్పే కంగనా రనౌత్ తాజాగా ఈ విషయంపై కూడా తన స్పందనను తెలియచేసింది.
కంగనా నటించిన లేడీ ఓరియెంటెడ్ ఫిలిం ధాకడ్ రెండో ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం నిన్న ఢిల్లీలో జరిగింది. ఈ ఈవెంట్ లో పాల్గొన్న ఆమెను విలేఖర్లు మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ వ్యాఖ్యలపై తన అభిప్రాయాన్ని తెలియచేమని ప్రశ్నించగా ఆమె ఇలా అన్నారు. మహేష్ బాబు చెప్పింది అక్షరాలా నిజం. ఆయన వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తున్నాను. మహేష్ బాబుకు ప్రముఖ ఫిలిం మేకర్స్ నుండి చాలా ఆఫర్స్ వస్తున్నాయని విన్నాను. అతని తోటి నటీనటులందరు కలిసి తెలుగు చిత్ర పరిశ్రమను దేశంలోనే గొప్ప చిత్ర పరిశ్రమగా తీర్చి దిద్దారు. అలాంటప్పుడు నిజంగానే, బాలీవుడ్ మహేష్ ను భరించలేదు. మహేష్ చేసిన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమ పట్ల ఆయనకున్న గౌరవాన్ని తెలుపుతున్నాయి. ఇది అందరూ గమనించాల్సిన విషయం. గత 10-15ఏళ్ళుగా ఎంతో కష్టపడి పని చేస్తున్న టాలీవుడ్ కోలీవుడ్ ను సైతం వెనక్కి నెట్టి మంచి సినిమాలను చేస్తుంది. అలాంటి వారిని చూసి మనం చాలా నేర్చుకోవాలి.... అని కంగనా వ్యాఖ్యానించింది. కంగనా చేసిన ఈ వ్యాఖ్యలు కొంతమంది బాలీవుడ్ బిగ్గిస్ కు విరుద్ధంగా ఉన్నాయి. ఇటీవలి కాలంలో కంగనా తెలుగు చిత్రపరిశ్రమను, సౌత్ ఫిలిం ఇండస్ట్రీ ను తెగ పొగిడేస్తున్న విషయం తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్, పుష్ప, కేజీఎఫ్ 2 సినిమాలప్పుడు కంగనా బాహాటంగానే సౌత్ వాళ్ళను పొగుడుతూ కామెంట్లు చేసింది.