కన్నడ చిత్రసీమతో పాటు దక్షిణాది సినీపరిశ్రమ స్థాయిని మరో మెట్టు పైకెక్కించిన చిత్రం ‘కేజీఎఫ్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ ఎంటర్టైనర్లో యశ్ కథానాయకుడిగా నటించారు. కన్నడలో రూ.200 కోట్ల మార్క్ను దాటిన తొలి సినిమాగా రికార్డు కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్. ఈ ఒక్క చిత్రంతోనే కథానాయకుడు యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్లకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇప్పుడు ఆ చిత్రానికి రెండో భాగం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ చిత్రాన్ని ఈ ఏడాది దసరా పండగ నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. తొలుత అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయాల్సి ఉంది. అయితే, చిత్రీకరణ విషయంలో రాజీ పడకుండా సన్నివేశాలను తెరకెక్కించడం, ప్రోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల ఆలస్యమవుతోంది. దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది.
గరుడను చంపడానికి కేజీఎఫ్లోకి అడుగుపెట్టిన రాఖీ ఆ తర్వాత దాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు? కేజీఎఫ్ను దక్కించుకోవడానికి ప్రయత్నించిన రాజేంద్ర దేశాయ్, కమల్, గురు పాండ్యన్, ఆండ్రూస్లను ఎలా ఎదుర్కొన్నాడు? తన తమ్ముడి మరణవార్త తెలిసిన అధీర ఏం చేశాడు? గరుడ చనిపోయాడన్న వార్త తెలిసి ఇనాయత్ ఖలి దేశంపై దండెత్తడానికి ఎలాంటి ప్రణాళికలు వేశాడు? కేజీఎఫ్ను దక్కించుకున్న రాఖీని అంతం చేయడానికి భారత ప్రభుత్వం ఏం చేసింది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు 'కేజీఎఫ్2'లో సమాధానం లభించనుంది.శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయిక. బాలీవుడ్ నటుడు సంజయ్దత్ ప్రతినాయకుడు అధీర పాత్రలో కనిపించనున్నారు. ప్రధానిగా రవీనా టాండన్ నటిస్తుండగా, ఓ కీలక పాత్రలో తెలుగు నటుడు రావు రమేశ్ నటిస్తున్నారు. హోంబాలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అలరించనుంది.