పుణె: సొంతగడ్డపై ఓటమి లేకుండా సాగుతున్న భారత్ జోరుకు బ్రేక్ పడింది. భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్లను మట్టికరిపించి స్వదేశంలో తమకు తిరుగులేదని నిరూపించింది టీమ్ ఇండియా. అంతర్జాతీయంగానూ క్రికెట్ విశ్లేషకుల నుంచి ప్రశంసలందుకుంది. కానీ, ఇవన్నీ ఆస్ట్రేలియాతో సిరీస్ ఆరంభం కాకముందు. అత్యంత నాణ్యమైన స్పిన్నర్లు కలిగి, స్పిన్ బౌలింగ్లో ఆరితేరిన బ్యాట్స్మెన్లు ఆసీస్తో జరిగిన తొలి టెస్టులో తేలిపోయారు. కనీసం గౌరవప్రదమైన ప్రదర్శన కూడా చేయకుండా సమష్టిగా చేతులెత్తేశారు. స్పిన్ మంత్రంతో ఆతిథ్య జట్టును చుట్టేసి 333 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 1-0తో ఆధిక్యం సాధించింది ఆస్ట్రేలియా.
ఓవర్నైట్ స్కోరు 143/4తో శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 285 పరుగులకు ఆలౌటైంది. సారథి స్టీవ్ స్మిత్(109) శతకంతో రాణించడంతో ఆసీస్ మంచి స్కోరు చేయగలిగింది. సహచర బ్యాట్స్మెన్లతో చిన్నచిన్న భాగస్వామ్యాలను నెలకొల్పుతూ స్కోరు బోర్డును ముందుండి నడిపించాడు. భారత బౌలర్లలో అశ్విన్ 4, జడేజా 3 ఉమేశ్ యాదవ్ 2 వికెట్లు దక్కించుకున్నారు. తొలి ఇన్నింగ్స్లో 155 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని మొత్తం 441 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్కు నిర్దేశించింది.