త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నానని ప్రకటించిన కమల్ హాసన్ తనకు విరాళాలుగా వచ్చిన రూ.30 కోట్లను తిరిగి ఇచ్చేయనున్నట్లు చెప్పాడు. పార్టీకి సంబంధించి ఇంకా ఎలాంటి పని మొదలుపెట్టలేదని, అలాంటప్పుడు ఈ డబ్బు తనతో ఉంచుకోవడం చట్ట విరుద్ధమవుతుందని కమల్ అన్నాడు. పార్టీ త్వరలోనే అని ప్రకటించినా ఇప్పటికే కచ్చితమైన సమయం మాత్రం అతను చెప్పలేదు. విరాళాలు తిరిగిచ్చేస్తున్నానంటే నేను వెనుకడుగు వేస్తున్నట్లు కాదు.. అలాగని డబ్బు తీసుకోనని కాదు.. అయితే ముందు పార్టీ పేరు పెట్టి, ప్రారంభించాలి అని కమల్ ఓ తమిళ మ్యాగజైన్కు రాసిన కాలమ్లో స్పష్టంచేశాడు. ఇదే ఆర్టికల్లో మరోసారి హిందువుల ప్రస్తావన అతను తీసుకొచ్చాడు. దేశంలో హిందువులు మెజారిటీ సంఖ్యలో ఉన్నారని, వాళ్లు పెద్దన్న పాత్ర పోషించాలని కమల్ చెప్పాడు. హిందువులు తాము ఎక్కువగా ఉన్నామని చెబుతున్నారంటే.. వాళ్ల మనసులు కూడా పెద్దగా ఉండాలి. ఇతరులను అక్కున చేర్చుకోవాలి. వాళ్లు తప్పు చేస్తే చెప్పాలి అని కమల్ అభిప్రాయపడ్డాడు. ఎక్కడ ఏ తప్పు జరిగినా అది వెలుగులోకి తీసుకురావడానికి ఓ యాప్ను ప్రారంభించిన కమల్.. ఇప్పుడు యాప్ ఒక్కటే కాదు ఇంకా చాలా చేస్తానని, రాజకీయాల్లోకి రాకుండా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని అభిమానులకు ఇలా చెప్పదలచుకున్నానని స్పష్టంచేశాడు.