2018, ఫిబ్రవరి 6లోగా ఆధార్ కార్డు సంఖ్యను మొబైల్ నెంబర్తో లింకింగ్ చేసుకోవాలని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకి కూడా స్పష్టతనిచ్చింది. లోక్నీతి ఫౌండేషన్ కేసులో భాగంగా 2017, ఫిబ్రవరి 6న నో యువర్ కస్టమర్ (కేవైసీ) విధానాల్లో భాగంగా మొబైల్ నెంబర్కి ఆధార్తో జత చేయాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఇందుకోసం ఏడాది గడువునిచ్చింది. ఫిబ్రవరి 6తో ఈ గడువు ముగియనుంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశం కాబట్టి ఫిబ్రవరి 6 తర్వాత గడువు తేదీని పొడిగించే హక్కు కేంద్రానికి ఉండకపోవచ్చు. ఈ విషయంతో పాటు ఆధార్ను రేషన్ కార్డుతో లింక్ చేయకపోవడం వల్ల ప్రజలు ఆకలితో చనిపోతున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని కేంద్రం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. అలాగే ఆధార్ - బ్యాంక్ అకౌంట్ నెంబర్ లింకింగ్ గడువును మార్చి 31కి పొడిగిస్తున్నట్లు పేర్కొంది.