ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ప్రజాప్రతినిధులు హాజరుకాకూడదంటూ ఆ పార్టీ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తప్పుబట్టారు. అసెంబ్లీని బహిష్కరించాలన్న నిర్ణయం ముమ్మాటికీ తప్పేనని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు అంశంతో పాటు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని వీటన్నిటిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్షంపైనే ఉందని ఆయన అన్నారు. ఇదే సమయంలో, జగన్ చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని ఉండవల్లి ఆకాంక్షించారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. చట్టంలో లేదనే కారణం చూపుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం తెలిపిందని మరి, చట్టంలో ఉన్న పోలవరంపై కేంద్ర ఎందుకు అలసత్వం చూపుతోందని ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికాకపోతే, చంద్రబాబు ఎంత ప్రచారం చేసుకున్నా వృథానే అని అన్నారు.