హైదరాబాద్: కార్తీకమాసం తొలి సోమవారం కావడంతో తెలుగురాష్ట్రాల్లో అన్ని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కార్తీక సోమవారంతో పాటు నాగుల చవితి కావడంతో భక్తులు సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి పూజలు చేస్తున్నారు.విజయవాడలో శైవక్షేత్రాల్లో భక్తుల సందడి నెలకొంది. ఇంద్రకీలాద్రికి దిగువన ఉన్న పద్మవాతిఘాట్లో భక్తులు కార్తీకస్నానాలు చేస్తున్నారు. అనంతరం దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాతశివాలయంలో శివుడికి వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు.నాగులచవితి సందర్భంగా కృష్ణా జిల్లా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి క్యూకట్టారు. పుట్టలో పాలు పోసి నాగేంద్రుకి పూజలు చేశారు.వరంగల్ వేయి స్తంభాల గుడికి భక్తులు పోటెత్తారు. కార్తీక సోమవారం కావడంతో ప్రత్యేక పూజలతో ఆలయం కిటకిటలాడుతోంది.