ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా 8 శాతం (11 మిలియన్లకు పైగా) కోవిడ్ -19 కేసులు పెరిగాయని శనివారం మీడియాకు తెలిపింది. డబ్ల్యుహెచ్ఓ కోవిడ్ టెక్నికల్ లీడ్, డాక్టర్ మరియా వాన్ కెర్ఖోవ్ దీనిపై కీలక విషయాలను వెల్లడించారు. చైనా, దక్షిణ కొరియా, యూకే, హాంకాంగ్ వంటి దేశాలు ప్రపంచవ్యాప్తంగా పరీక్షలు గణనీయంగా తగ్గాయనే నివేదికలు గతంలో వచ్చాయన్నారు. కోవిడ్ -19కి సంబంధించి పెద్ద మొత్తంలో తమకు తప్పుడు సమాచారం అందిందన్నారు. మహమ్మారి దశ ముగిసిందని భావించామని, అది తప్పని తేలిందన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ అంతగా ప్రభావం చూపదనే అంచనాలు తమకు అందాయన్నారు. ఇదే చివరి వేరియంట్ అనుకున్నామన్నారు. ఇందులో మ్యుటేషన్ల కారణంగా చైనా, దక్షిణ కొరియాలలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. కరోనా ఎఫెక్ట్ ఇంకా ముగియలేదని, ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉండగా స్టెల్త్ ఓమిక్రాన్ వేరియంట్ ద్వారా నడిచే రోజువారీ కేసుల పెరుగుదలతో చైనాలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఇక సింగపూర్లో 24 గంటల వ్యవధిలో కొత్తగా 10,244 కేసులు, హాంకాంగ్లో 16,597 కేసులు నమోదయ్యాయి.