మరికొద్ది రోజుల్లో గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు అటు అధికార భాజపాకు, ఇటు కాంగ్రెస్కు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అందుకు తగ్గట్టుగానే ఇరు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు గుజరాత్లో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. అయితే ఇటీవల కొన్ని రోజులు గుజరాత్లో పర్యటించి భాజపాపై విమర్శల వర్షం కురిపించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ తాజాగా మరోసారి ప్రధానిపై వ్యాఖ్యలు చేశారు. గుజరాత్లో ఈ రోజు మాటల వర్షం కురుస్తుందంటూ మోదీ పర్యటనను ఉద్దేశించి విమర్శలు చేశారు.
ప్రధాని మోదీ నేడు సొంత రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అహ్మదాబాద్లో ఏర్పాటుచేసిన ‘గుజరాత్ గౌరవ్ మహాసమ్మేళన్’లో పాల్గొననున్నారు. కాగా.. ప్రధాని పర్యటనపై ట్విటర్ వేదికగా రాహుల్గాంధీ విమర్శలు చేశారు. ‘వాతావరణ రిపోర్ట్: ఎన్నికలకు ముందు.. గుజరాత్లో నేడు మాటల వర్షం కురవనుంది’ అని రాహుల్ హిందీలో ట్వీట్ చేశారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ రాష్ట్రానికి పలు ప్రాజెక్టులు ప్రకటించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాహుల్ ఈ ట్వీట్ చేశారు.