న్యూఢిల్లి : ఢిల్లిలో అనుమానాస్పద స్థితిలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. వీరిలో నలుగురు మహిళలని పోలీసులు చెప్పారు. షాదారాలోని మానసరోవర్ పార్కు ప్రాంతంలోని ఒక ఇంట్లో 82 ఏళ్ల మహిళ, ఆమె కుమార్తెలు ముగ్గురు, వారి గార్డు మరణించినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నుపుర్ ప్రసాద్ చెప్పారు. మృతులను జిందాల్ కుటుంబానికి చెందిన వారిగా గుర్తించినట్లు ప్రసాద్ తెలిపారు. మృతులను ఊర్మిళా జిందాల్, సంగీత (56), నుపుర్ (48), అంజలి (38), వారి గార్డు రాకేశ్ (42)గా గుర్తించారు. ఎవరూ ఇంట్లోకి చొరబడలేదని, విలువైన వస్తువులేవీ పోలేదని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని ఒక పోలీస్ అధికారి తెలిపారు.