ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే మేజర్ సునీల్ దత్ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. రక్తమడుగులో ఉన్న వ్యక్తిని ఎమ్మెల్యే తన భుజాలపై ఎత్తుకెళ్లి.. ఆస్పత్రిలో చేర్పించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. భీమ్సేన్ మార్కెట్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులను తీవ్రగాయాలయ్యాయి. అదే దారిలో వెళ్తున్న ఎమ్మెల్యే సునీల్దత్ ముగ్గురు వ్యక్తులు తీవ్రగాయాలతో ఉన్నట్లు గమనించారు. ఎమ్మెల్యే సునీల్దత్ వెంటనే తన వాహనాన్ని ఆపి..బాధితులను తన వాహనంలో ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి చేరుకోగానే అక్కడ రెండు స్ట్రెచర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఎమ్మెల్యే సెక్యూరిటీ సిబ్బంది ఇద్దరు బాధితులను స్ట్రెచర్పై ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు.
మరో వ్యక్తిని లోపలికి తీసుకెళ్లేందుకు స్ట్రెచర్ లేకపోవడంతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఎమ్మెల్యే సునీల్దత్ బాధితుడిని తన భుజాలపై ఎత్తుకొని వార్డులో చేర్పించారు. బాధితుడిని చికిత్స అత్యవసరమని..అలాంటి పరిస్థితిలో స్ట్రెచర్ లేకపోవడంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా భుజాలపై తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే సునీల్దత్ తెలిపారు. ఎమ్మెల్యే సునీల్దత్ తనను తీసుకురాకపోతే ప్రాణాలు పోయేవని, తనలాంటి పేదవాడిని అత్యవసర పరిస్థితిలో ఆస్పత్రిలో చేర్పించి ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే సునీల్దత్ కు రుణపడి ఉంటామని బాధితుడు అరవింద్ తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో ఎమ్మెల్యే సునీల్దత్ చూపిన మానవత్వానికి అందరూ సెల్యూట్ చేస్తున్నారు.