తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని ఐదు తలల చిన్న శేషవాహనంపై విహరిస్తారు. పెద్ద శేషవాహనాన్ని ఆదిశేషుడుగా, చిన్న శేషవాహనాన్ని నాగ జాతిలో అనంతుడైన వాసుకిగా పురాణాలు పేర్కొన్నాయి. చిన్న శేషవాహనాన్ని దర్శించే భక్తులకు దివ్య చైతన్యం ద్వారా కుండలినీ యోగ ఫలం లభిస్తుందని ప్రతీతి. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 11 గంటల లోపు మలయప్పస్వామి వీణాపాణియైు సరస్వతీమూర్తిగా హంస వాహనంపై దర్శనమిస్తారు. పరమశివుని హస్తాభరణంగా, కంఠాభరణంగా విరాజిల్లే వాసుకి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శ్రీవారి సేవలో తరిస్తాడు. ఈ వాహన సేవను దర్శించి, ధ్యానించేవారికి మనసు, కర్మ శ్రీనివాసుని అధీనమై, ఆయనకు అభిముఖమవుతాయని, అప్పుడు మానవుడు మాధవునికి నిజమైన సేవకుడవుతాడని పెద్దలు చెబుతారు.