గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెం గ్రామానికి చెందిన మరుప్రోలు జశ్వంత్ రెడ్డి గతేడాది జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులతో పోరులో అమరుడయ్యాడు. రాజౌరిలో జరిగిన భీకర ఎన్ కౌంటర్ లో ఓ టెర్రరిస్టును మట్టుబెట్టిన జశ్వంత్ రెడ్డి తీవ్రగాయాలతో వీరమరణం పొందాడు. నాటి టెర్రర్ ఆపరేషన్ సందర్భంగా తన టీమ్ కమాండర్ ప్రాణాలు కాపాడిన ఈ యువ సిపాయి తాను ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో జశ్వంత్ రెడ్డికి కేంద్రం మరణానంతరం శౌర్య చక్ర పురస్కారం ప్రకటించింది. జశ్వంత్ రెడ్డి 2016లో సైన్యంలో చేరాడు. మద్రాస్ రెజిమెంట్ లో శిక్షణ పొంది, తొలుత నీలగిరి వద్ద విధులు నిర్వర్తించాడు. ఆ తర్వాత జమ్ము కశ్మీర్ కు బదిలీపై వెళ్లాడు.