కరోనా, ఒమిక్రాన్ ను పట్టుకొందమాంటే అందడంలేదు. ఇది ప్రస్తుతం నెలకొన్న దుస్థితి. కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి.. తీరా పరీక్షా కేంద్రానికి వెళ్లి నమూనా ఇచ్చిన తర్వాత నెగెటివ్ అని ఫలితం చెబుతుండడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి చాలా మందికి ఎదురవుతోంది. దగ్గు, జలుబు, ఒంటి నొప్పుల లక్షణాలతో ఎన్నడూ లేనట్టు ఇబ్బందిగా అనిపించిన వారికి కూడా పరీక్షల్లో పాజిటివ్ రావడం లేదు. కొన్ని రకాల పరీక్షా విధానాలు, సరైన విధానంలో పరీక్ష చేయకపోవడం, ముక్కు నుంచి ద్రవాన్ని సరిగ్గా సేకరించకపోవడం, రవాణా సమయంలో శాంపిళ్లను సరిగా నిల్వ చేయకపోవడం ఫలితాలను మారుస్తుందని పీడీ హిందుజా హాస్పిటల్ కు చెందిన వైద్యుడు భరేష్ దాదియా చెప్పారు. ‘‘కొన్ని ఒమిక్రాన్ వేరియంట్లు ఆర్టీపీసీఆర్, ముఖ్యంగా రాపిడ్ యాంటీజెన్ టెస్ట్ లో నెగెటివ్ గానే రీడ్ అవుతున్నాయి. ర్యాపిడ్ యాంటీజెన్ సెన్సిటివిటీ 50 శాతమే. వైరల్ లోడ్ కూడా తక్కువగా ఉంటోంది. సీటీ వ్యాల్యూ 35 కంటే ఎక్కువ ఉంటే దాన్ని నెగెటివ్ గా పరిగణిస్తారు. వైరల్ లోడ్ తక్కువ ఉన్న వారిలో సీటీ వ్యాల్యూ35 కంటే ఎక్కువ ఉంటోంది. దాంతో ఫలితం నెగెటివ్ అని చూపిస్తోంది’’ అని దాదియా వివరించారు.