కుటుంబానికి సంబంధించి వారసత్వంగా దక్కే అన్ని విషయాలకూ కోడలు చట్టబద్ధ వారసురాలు అవుతుందని అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కుటుంబంలో కన్న కూతురి కంటే కోడలు లేదా విధవరాలైన కోడలికే ఎక్కువ హక్కులు ఉంటాయని పేర్కొంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
యూపీ సర్కార్ నిత్యవసర వస్తువుల (ఉత్పత్తి, పంపిణీ, ధరల నిర్ధరణ) చట్టం 2016లో ఇంటికి వచ్చే కోడలిని కుటుంబ సభ్యురాలిగా పేర్కొనలేదు. ఆ రాష్ట్రానికి చెందిన పుష్పా దేవి అనే మహిళ భర్త మరణించడంతో ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి అత్త మహాదేవితోనే ఉంటోంది. అత్త మహాదేవి పేరు మీద ఓ రేషన్ షాప్ ఉంది. ఇటీవల మహాదేవి చనిపోవడంతో వారసత్వంగా వస్తున్న ఆ రేషన్ షాప్ ను తనకు కేటాయించాలని పుష్పాదేవి అధికారులకు అర్జీ పెట్టుకుంది.
కాగా 2019, ఆగస్టు 5న ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం పుష్పాదేవి చనిపోయిన మహాదేవికి వారసురాలు కాదంటూ రేషన్ షాపును కేటాయించేందుకు నిరాకరించింది. దీంతో పుష్పాదేవి కోర్టును ఆశ్రయించగా ఈ మేరకు తీర్పు ఇచ్చిన కోర్టు, ఈ అంశంలో 2019 ఆగస్టు 5న ఇచ్చిన ఉత్తర్వుల్లో సవరణ చేయాలని చెప్పింది.