మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అక్కను తమ్ముడు నరికి చంపాడు. గర్భం దాల్చిందన్న కనికరం లేకుండా దారుణానికి పాల్పడ్డాడు. ఇందుకు అతని తల్లి కూడా సహకరించింది.
వివరాల్లోకి వెళితే.. 19 ఏళ్ల కీర్తి థోర్ అనే యువతి ఈ ఏడాది జూన్లో ఇంటి నుంచి పారిపోయింది. వీర్గావ్ ప్రాంతంలో భర్త, అత్తమామలతో కలిసి ఉంటోంది. ఆమె కులాంతర వివాహం చేసుకోవడంతో ఆమె కుటుంబం ఆగ్రహంతో ఉంది. వారం కిందట కీర్తి తన తల్లితో ఫోన్లో మాట్లాడింది. తాను గర్భందాల్చానని, తన ఇంటికి రమ్మని కోరింది. దీంతో ఆమె తల్లి వచ్చి వెళ్లింది. ఈ నెల 5న ఆదివారం తన కుమారుడితో కలిసి మళ్లీ వచ్చింది.
వంట గదిలో కీర్తి టీ చేస్తుండగా తల్లి, తమ్ముడు వంటగదిలోకి వచ్చారు. తల్లి.. కీర్తి కాళ్లు గట్టిగా పట్టుకోగా కుమారుడు తన వెంట తెచ్చిన కొడవలితో కీర్తి తల నరికాడు. ఇంట్లో అనారోగ్యంతో పడుకున్న కీర్తి భర్తను కూడా చంపేందుకు ప్రయత్నించాడు. కానీ అతడు అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం తెగిన కీర్తి తలతో ఆమె తమ్ముడు, తల్లి సెల్ఫీ తీసుకున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చి కీర్తి తలను స్థానికులకు చూపించాడు. తర్వాత తల్లితో కలిసి అక్క తలతో వీర్గావ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. పరువు హత్యగా పేర్కొన్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.