నాగాలాండ్ లో సైన్యం కాల్పులు, అనంతరం చెలరేగిన హింసలో 14 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై పార్లమెంటు ఉభయ సభలు దద్ధరిల్లాయి. రాజ్యసభ ప్రారంభం కాగానే, ఛైర్మన్ వెంకయ్య నాయుడు శూన్య గంటను ప్రారంభించగా, నాగాలాండ్ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. అయితే ఈ అంశం చాలా తీవ్రమైనదని, సభా కార్యక్రమాలు కొనసాగించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేసినా, విపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో వెంకయ్య సభను 12 గంటల వరకు వాయిదా వేశారు.
తిరిగి ప్రారంభమైన తర్వాత......12 మంది సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలన్న విపక్షాల ఆందోళనతో రాజ్యసభ 2 గంటల వరకు వాయిదా పడింది. ఈ అంశంపై లోక్ సభలోనూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. నాగాలాండ్ అంశంపై ప్రకటన చేయాలని విపక్షాలు సహా ధాన్యం సేకరణ అంశంపై సభలో తెరాస ఆందోళన చేపట్టింది. అటు నాగాలాండ్ అంశంపై హోం మంత్రి అమిత్ షా ఉభయ సభల్లో ప్రకటన చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు లోక్ సభలో, నాలుగు గంటలకు రాజ్యసభలో ప్రకటన చేయనున్నారు.