పోలవరం విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నిజాలు తెలుసుకుని మాట్లాడాలని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి పీ. అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. గురువారం ఆయన గూడూరు పట్టణ సమీపంలో వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. ముఖ్యంగా జాతీయ రహదారిపై నీటి ప్రవాహంతో వాహనాలు నిలిచిపోయిన ప్రదేశాన్ని పరిశీలించారు. నూతనంగా నిర్మిస్తున్న హై లెవల్ వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండడంపై అసహనం వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన పనులు నిర్వహించాలని కాంట్రాక్టర్ ను హెచ్చరించారు. మూడు రోజుల వ్యవధిలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ సమస్య వేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ, పోలీసు శాఖల అధికారులను కోరారు.
అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. జిల్లాను వర్షాలు అతలాకుతలం చేశాయన్నారు. పదిహేను రోజుల క్రితం భారీ వర్షాలు ముంచెత్తడంతో పెన్నా నది నిండి కోవూరు పరిసర ప్రాంతాలు నీట మునిగి ప్రజలకు అపార నష్టం వాటిల్లిందన్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ గూడూరు ప్రాంతంలో వరద భీభత్సఞ సృష్టించి జాతీయ రహదారిపై రాకపోకలకు ఆంతరాయం ఏర్పడుతోందన్నారు.
త్వరితగతిన బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. పోలవరం విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నిజాలు తెలుసుకుని మాట్లాడితే మంచిగా ఉంటుందన్నారు. 2018లోనే పోలవరం నీరు రైతులకు అందిస్తామని చెప్పిన దేవినేని ఉమను టీడీపీ నాయకులు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. పోలవరం ఎందుకు ఆలస్యమైందో టీడీపీ నాయకులకు తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ రావు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ మేరిగ మురళి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పొణకా దేవసేనమ్మ, వైసీపీ నాయకులు చేవూరు విజయ్ మోహన్ రెడ్డి, పొణకా శివకుమార్ రెడ్డి, ఆర్డీఓ వీ. మురళీ కృష్ణ, డీఎస్పీ ఎం. రాజగోపాల్ రెడ్ఖి, వైసీపీ పట్టణాధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసులు, కార్మిక విభాగం రాష్ట్ర నారకులం మండ్ల రాజేష్ కుమార్, అన్నం మురళి, జొన్నలగడ్డ సత్యం, గోపాల్, దిలీప్, ఇరిగేషన్ శాఖ అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.