స్పెయిన్లో సరికొత్త సంస్కృతికి తెరతీశారు. మనసార ఏడవడానికి ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేశారు. వివరాల్లోకి వెళితే.. అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా స్పానిష్ ప్రధాన మంత్రి పెడ్రో శాంచెజ్ ఈ ‘క్రైయింగ్ రూం’ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒత్తిడి, ఆందోళన సమస్యలను ఎదుర్కొంటున్న వారు సమస్యల నుంచి బయటపడడానికి ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. మనసులో బాధపడుతున్న వారు ఈ ప్రత్యేక గదుల్లో మనసారా ఏడవొచ్చు. సెంట్రల్ మాడ్రిడ్లో ఏర్పాటు చేసిన ఈ గదుల్లో ఎప్పుడూ మానసిక వైద్యులు అందుబాటులో ఉంటారు. ఇక స్పెయిన్ ప్రభుత్వం ఈ వినూత్న నిర్ణయాన్ని తీసుకోవడానికి దేశంలో జరుగుతోన్న ఆత్మహత్యలు కారణంగా చెబుతున్నారు. 2019లో స్పెయిన్లో ఏకంగా 3,671 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. స్పెయిన్ జనాభాలో దాదాపు 5.8 శాతం మంది ఆందోళన, ఒత్తిడితో సతమతమవుతున్నారని అలాంటి వారి కోసమే ఈ క్రైయింగ్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు అక్కడి ప్రభుత్వం చెబుతోంది.