సీఎం వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో భారీ రిక్రూట్మెంట్కు ఆమోదం తెలిపారు. ఒకేసారి ఏకంగా 11,775 వైద్య పోస్టుల భర్తీకి సీఎం అంగీకారం తెలిపారు. పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆమోదం తెలిపిన ఆర్థిక శాఖ నేడో రేపో ఉత్తర్వులు జారీ చేయనుందని, ఆ వెంటనే నోటిఫికేషన్ ఇస్తామని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ వెల్లడించారు. మరోవైపు వీటికి అదనంగా కొత్త పీహెచ్సీల నిర్మాణం కొనసాగుతున్నందున మరో 3,176 పోస్టులను కూడా తరువాత భర్తీ చేయనున్నట్లు వివరించారు. గత సర్కారు ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోగా రద్దు చేసి ఔట్సోర్సింగ్కు అవకాశం కల్పించింది. ఇందుకు భిన్నంగా ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలందించేందుకు డాక్టర్లతో పాటు నర్సులు, పారామెడికల్ సిబ్బంది సహా ఇతర ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించారు.