పాట్నా : బీహార్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఏరియల్ సర్వే నిర్వహించారు. వరద పరిస్థితిపై సమీక్షించారు సీఎం నితీష్. అనంతరం నితీష్ మీడియాతో మాట్లాడుతూ.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆ ప్రాంత ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు హెలికాప్టర్ ద్వారా ఆహారం సరఫరా చేస్తామని స్పష్టం చేశారు. వరదల నేపథ్యంలో తీసుకోవాల్సిన పరిస్థితులపై ఉన్నతాధికారులతో చర్చించామని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు.. కలెక్టర్లు, రూరల్ డెవలప్మెంట్ అధికారులు, విపత్తు నిర్వహణ చీఫ్ సెక్రటరీ పర్యటిస్తారని సీఎం నితీష్ తెలిపారు. బీహార్లో వర్షాల వల్ల భారీగా వరదలు వస్తున్నాయి. సుమారు 12 జిల్లాలు జలమయం అయ్యాయి. మొత్తం పది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. మరో ఆరు టీమ్లు కూడా జతకలవనున్నాయి. సహాయక చర్యలను ముమ్మరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సితామార్చిలో ఉన్న భాగమతి నది ఉప్పొంగి ప్రవహిస్తున్నది. గోపాల్గంజ్లో ఉన్న గండక్ కూడా ఉదృతంగా ప్రవహిస్తున్నది. వరదల నేపథ్యంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్తో ప్రధాని మోదీ మాట్లాడారు. వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని హామీ ఇచ్చారు. బీహార్లో ఎన్డీఆర్ఎఫ్ సహాయక దళాలు రెడీగా ఉన్నట్లు పీఎంవో వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్లోనూ నదులన్నీ హెచ్చు స్థాయిలో ప్రవహిస్తున్నాయి. బలరామ్పూర్లోని రప్తీ, బుదాన్లోని గంగా నది ఉదృతంగా ప్రవహిస్తున్నట్లు ఎన్డీఆర్ఎఫ్ తెలిపింది.