దేశవాళీ క్రికెట్లో కర్ణాటక జట్టుతో ఉన్న 15 ఏళ్ల బంధాన్ని ఇటీవల తెంచుకున్న ఓపెనర్ రాబిన్ ఉతప్ప.. సౌరాష్ట్ర జట్టుతో అధికారికంగా గురువారం చేరాడు. టీమిండియాకి ఆడుతూ చతేశ్వర్ పుజారా, రవీంద్ర జడేజా లాంటి స్టార్ క్రికెటర్లు దూరమైన నేపథ్యంలో రాబిన్ ఉతప్ప చేరిక ప్రస్తుతం సౌరాష్ట్ర జట్టులో ఉత్సాహం నింపేదే. త్వరలో జరగనున్న దేశవాళీ క్రికెట్ సీజన్లో రాబిన్ ఉతప్ప రాకతో సౌరాష్ట్ర తప్పకుండా మెరుగైన ప్రదర్శన చేస్తుందని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ధీమా వ్యక్తం చేసింది.
‘జట్టులోకి రాబిన్ ఉతప్పకు సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సాదర స్వాగతం పలుకుతోంది. జట్టుతో చేరేందుకు అవసరమైన అన్ని ఫార్మాలటీస్ని ఉతప్ప పూర్తి చేశాడు. బీసీసీఐ, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ నుంచి పూర్తిస్థాయి అనుమతులు వచ్చాయి. ఈ ఓపెనర్ చేరికతో సౌరాష్ట్ర జట్టుకి బలం చేకూరుతుంది’ అని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. 2002-03 రంజీ సీజన్తో కర్ణాటక జట్టులోకి అరంగేట్రం చేసిన ఉతప్ప.. సుదీర్ఘకాలం అక్కడే ఆడాడు. కానీ.. గత సీజన్లో కీలకమైన మ్యాచ్లకి కూడా ఈ ఓపెనర్ని పక్కకి పెట్టడంతో జట్టు మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.