టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి ప్రయత్నాన్ని అడ్డుకున్న తమపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం అన్యాయమని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని బుద్ధ వెంకన్న నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్, ఆయన అనుచరులు చంద్రబాబు ఇంటిపై దాడికి వచ్చారని, తామంతా కలిసి వారి ప్రయత్నం అడ్డుకున్నామన్నారు.
ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామన్నారు. ఏపీలో పోలీసులు సొంతంగా పనిచేయడం లేదని విమర్శించారు. వైసీపీ నేతలు చెప్పినట్టే పోలీసులు పనులు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నివాసంపై దాడికి వైసీపీ నేతలు వస్తే. టీడీపీ నేతలపైనే కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు. పోలీసులు నిజాయితీగా పనిచేయాలన్నారు. రాజకీయ నేతల కంటే ఘోరంగా పోలీసు అధికారులు మాట్లాడుతున్నారని బుద్దా వెంకన్న విమర్శించారు. కొంతమంది పోలీసులు ప్రమోషన్ల కోసం ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారని, పోలీసు అధికారుల సంఘం దీనిని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.
చత్తీస్గఢ్ తరహాలో ప్రజలు పోలీసులపై తిరగబడే రోజు వస్తుందన్నారు. కొంతమంది చేసే తప్పులకు పోలీసు వ్యవస్థ మొత్తం నింద మోయాల్సి వస్తుందని, ఏపీ పోలీసు అంటే. సినిమా పోలీసు అనే అపవాదు మూట కట్టుకున్నారన్నారు. స్వార్ధ ప్రయోజనాల కోసం. నిజాయితీ అధికారుల జీవితాలను బలి చేయవద్దని సూచించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను టీడీపీ బహిష్కరించిందన్నారు. నిజంగా వైసీపీకి ప్రజా బలం ఉంటే. ఇప్పుడు ఎన్నికలకు రావాలంటూ సవాల్ చేశారు.