ఏపీలో సూక్ష్మసేద్యాన్ని ప్రోత్సహించేందుకు అక్టోబర్ 1వ తేదీ నుంచి బిందు, తుంపర సేద్య పరికరాలను పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.1,190.11 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. ఈ ఏడాది లక్షన్నర హెక్టార్లలో సూక్ష్మసేద్యాన్ని ప్రోత్సహించేందుకు అర్హులైన రైతులకు బిందు, తుంపరసేద్య పరికరాలు పంపిణీ చేస్తామన్నారు. గురువారం విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ, ఉద్యానశాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బోర్ల కింద వరి సాగుచేయని, గతంలో ఈ పథకం కింద లబ్ధిపొందని రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఉద్యాన, వ్యవసాయ సహాయకులకు పూర్తిస్థాయిలో సాంకేతిక శిక్షణ ఇవ్వాలన్నారు. వైఎస్సార్ పొలంబడి, తోటబడిని క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. గోదావరి జిల్లాల్లో కొబ్బరి తోటలకు సోకుతున్న మొవ్వ తెగులు నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.