కరోనా వైరస్ పోవాలని, కరోనా నుంచి ప్రజలను కాపాడాలని ఓ గ్రామంలోని ప్రజలు రాగి, వేప చెట్లకు పెళ్లి చేశారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. తిరువణ్ణామలై జిల్లా ఆరణి తాలుకా నరియంపేటలో శ్రీతంజయమ్మన్ అనే ఆలయం ఉంది. పదేళ్ల క్రితం గ్రామస్తులు ఆ ఆలయాన్ని నిర్మించారు. ఆ సమయంలో ఒక మహిళపై అమ్మవారు వాలి, ఆలయం ఉన్న ప్రాంతంలో రాగి, వేప చెట్లను నరకవద్దని చెప్పిందని, ఆ రెండు చెట్లు దేశ ప్రజలను కాపాడుతాయని అమ్మవారు చెప్పినట్లు ఆ గ్రామస్థులు చెబుతున్నారు. ప్రతి రోజూ ఆ చెట్లకు పూజలు చేస్తున్నారు.
ఈ క్రమంలో రెండు రోజుల క్రితం అదే మహిళపై అమ్మవారు మళ్లీ వాలి, దేశంలో కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు, ఆక్సిజన్ సమస్య రాకుండా ఉండాలంటే వేప, రాగి చెట్లకు పెళ్లి చేయాలని తెలిపింది. దీంతో గ్రామస్తులు పెళ్లి పత్రికలు గ్రామంలో పంచి పెట్టి.. సంప్రదాయం ప్రకారం బంగారం తాళి బొట్టును వేప చెట్టుకు కట్టి వివాహం చేశారు. ఈ ఘటన పలువురిని ఆశ్చర్యపరిచింది. పెళ్లి అనంతరం గ్రామస్తులందరికీ వివాహ వేడుకల తరహాలోనే విందు ఏర్పాటు చేశారు.