దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్రమైన ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఆక్సిజన్ ను సరఫరా చేయడానికి సమయం కూడా పడుతుంది. దీంతో ఆక్సిజన్ను రవాణా చేసే బాధ్యతను రైల్వే శాఖ చేపట్టింది. అతి తక్కువ సమయంలో అవసరమైన రాష్ట్రాలకు ఆక్సిజన్ ను అందించడానికి ‘రైల్వే ఆక్సిజన్ ఎక్స్ప్రెస్’ పేరిట రైల్ ను నడపనుంది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి పీయూశ్ గోయల్ ట్వీట్ చేశారు. వేగంగా ప్రయాణించడానికి వీలుగా ‘గ్రీన్ కారిడార్’ ను కూడా ఉపయోగిస్తున్నామని గోయల్ తెలిపారు. అతి వేగంగా ఆక్సిజన్ సరఫరా కావడానికి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు భారత రైల్వే సహాయం కోరాయని, దీనిని పరిగణనలోకి తీసుకొని గ్రీన్ కారిడార్ ద్వారా ఆక్సిజన్ ను రైల్వే ద్వారా సరఫరా చేస్తున్నామని రైల్వే మంత్రి పేర్కొన్నారు. సోమవారం మహారాష్ట్ర నుంచి రైళ్లు ఖాళీగానే ప్రారంభమవుతాయని, ఆ తర్వాత విశాఖపట్నం, షెంజెడ్పూర్, రూర్కెలా, బోకారో నుంచి ఆక్సిజన్ ను నింపుకుంటుందని పీయూశ్ గోయల్ తెలిపారు.