ఐపీఎల్ 14వ సీజన్ లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. మంగళవారం చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ పై 10 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. సూర్య కుమార్ యాదవ్(56), రోహిత్ శర్మ(43) రాణించారు. ఆండ్రీ రస్సెల్(5/15) 5 వికెట్లతో ముంబై ను భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నాడు. పాట్ కమిన్స్(2/24) కూడా రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులే చేసింది. దినేశ్ కార్తీక్ క్రీజులో ఉన్నా జట్టును గెలిపించలేకపోయాడు. డెత్ ఓవర్లలో ముంబై బౌలర్లు అదరగొట్టారు. కోల్కతా విజయానికి 30 బంతుల్లో 31 పరుగులు చేయాల్సి ఉండగా చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. సులువుగా గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కోల్కతా చేజేతులా మ్యాచ్ ను చేజార్చుకుంది. ఓపెనర్ నితీశ్ రాణా(57) మరోసారి రాణించాడు. ముంబై యువ బౌలర్ రాహుల్ చాహర్(4/27) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆఖరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా ట్రెంట్ బౌల్ట్(2/27) అద్భుతంగా బౌలింగ్ వేసి 4 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు.