ముంబై: కస్టమర్లకే కాదు రిలయెన్స్ షేర్ హోల్డర్లకు కూడా బంపర్ ఆఫర్ ప్రకటించారు ముకేశ్ అంబానీ. రిలయెన్స్ 40వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా షేర్హోల్డర్లకు 1:1 బోనస్ ప్రకటించారు. అంటే ప్రస్తుతం ఒక షేర్ ఉన్న అందరికీ మరో షేర్ ఫ్రీగా ఇవ్వనున్నారు. దీంతో రిలయెన్స్ షేర్ ధర అమాంతం పెరిగింది. ఏకంగా 3.19 శాతం లాభపడి రూ.1578కి చేరింది. అంతకుముందే సమావేశం ప్రారంభమైన సమయంలోనే రిలయెన్స్ షేర్లు 9 ఏళ్ల గరిష్ఠ స్థాయికి చేరినట్లు వార్తలు వచ్చాయి. 1977లో తొలిసారి రిలయెన్స్ ఐపీఓకి వెళ్లింది. అప్పటి నుంచీ దేశంలో షేర్హోల్డర్ సంస్కృతికి తెరలేపింది. ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత 1+1 షేర్ బోనస్తో షేర్హోల్డర్లకు పెద్ద బహుమానమే ఇచ్చారు అంబానీ. 1977లో రూ.వెయ్యి పెట్టి రిలయెన్స్ షేర్ కొంటే.. దాని విలువ ఇప్పుడు రూ.16.5 లక్షలకు చేరినట్లు అంబానీ వెల్లడించారు. సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5 లక్షల కోట్లకు చేరిందని ఆయన తెలిపారు.