ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోస్తాంధ్ర‌లో విస్తారంగా వ‌ర్షాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jul 18, 2017, 02:54 PM

విజ‌య‌వాడ‌: వాయువ్య బంగాళాఖాతంలో కొన‌సాగుతున్న వాయుగుండం ప్రభావంతో ఒడిశా, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జూలై నెలలో ఇప్పటి వరకు ఒక మోస్తరుగానే వర్షాలు కురవడంతో అంతంతమాత్రంగా సాగుతున్న వ్యవసాయానికి తాజాగా ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మేలు చేకూరుస్తుందని నిపుణులు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి గుంటూరు వరకు విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాలోని మిగతా జిల్లాలు, రాయలసీమలోనూ మోస్తరు ప్రభావం చూపుతోంది. ఒడిశాలో భారీ వర్షాలకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని నదుల్లోకి వరదనీరు పోటెత్తుతోంది. వంశధార, నాగావళి నదుల్లోకి ఒక్కసారిగా ఎగువ నుంచి వరదనీరు వచ్చి చేరుతోంది. డ్యామ్‌లకు ఏ మాత్రం నష్టం వాటిల్లకుండా..  ప్రజలకు ప్రాణాపాయం లేకుండా అధికార యంత్రాంగం అప్రమత్తమై నీటిని దిగువకు విడుదల చేస్తోంది. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ జోరుగా వానలు పడుతున్నాయి. దీంతో సకాలంలో సాగుకు ఇబ్బంది లేని విధంగా నీటిని విడుదల చేశారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా పరిధిలోనూ రికార్డు సమయంలో కాలువలకు నీటిని విడుదల చేసి వ్యవసాయ పనులు ముమ్మరంగా చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో శ్రీకాకుళం నుంచి గుంటూరు జిల్లా వరకు ఖరీఫ్‌ పనుల జోరుకు ఢోకా ఉండబోదని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమ చెబుతున్నారు. వర్షాలు కురుస్తున్నందున పట్టిసీమ పంపులను క్రమక్రమంగా ఆపేస్తున్నామని..  అవసరమైన సమయంలో మళ్లీ నీటిని కాల్వలకు విడుదల చేస్తామని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com