కర్నూలు జిల్లా నంద్యాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పాఠశాలలు పెట్టి, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కోట్ల కొద్దీ రూపాయల డిపాజిట్ల సేకరించి చేతులెత్తేసిన కేశవరెడ్డి విద్యా సంస్థలను శ్రీ చైత్యన్య టేకోవర్ చేసింది. కేశవరెడ్డి విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని శ్రీ చైతన్య యాజమాన్యం స్పష్టం చేసింది. కాగా, ఏపీ మంత్రి నారాయణ కుటుంబ సభ్యులు నడుపుతున్ననారాయణ, శ్రీ చైతన్యలు గతంలో విలీనమై, తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో పాఠశాలలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మరో మంత్రి ఆదినారాయణరెడ్డికి వియ్యంకుడైన కేశవరెడ్డి, తమ వద్ద డబ్బు డిపాజిట్ చేస్తే, ఒకటి నుంచి పది వరకూ ఉచితంగా చదువు చెబుతామని, చివర్లో ఆ డబ్బును వెనక్కు ఇస్తామని ప్రచారం సాగించి, గడచిన పదిహేను సంవత్సరాల వ్యవధిలో వందలాది మంది తల్లిదండ్రుల నుంచి లక్షల్లో డబ్బులు కట్టించుకుని, వాటిని వెనక్కు ఇవ్వడంలో విఫలమైన సంగతి విదితమే.