ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియుడి మోజులో పడి కాబోయే భర్తను ఇంటికి పిలిచి చంపేసింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 28, 2020, 03:33 PM

ప్రియుడి మోజులో పడి డిగ్రీ చదువుతున్న ఓ యువతి కాబోయే భర్తను హత్య చేయించింది. ప్రియుడు, మరో నలుగురు యువకుల సాయంతో ఈ దారుణానికి ఒడిగట్టింది. అయితే ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు తొలుత రోడ్డు ప్రమాదంగా భావించారు. అనంతరం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు మిస్టరీని 24 గంటలు గడవక ముందే పోలీసులు ఛేదించడం గమనార్హం.
వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన యువతి స్థానికంగా ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్‌ సెకండియర్‌ చదువుతోంది. ఇదే కళాశాలలో చదువుతున్న క్లాస్‌మేట్‌తో ఏర్పడ్డ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ తరచూ కలుసుకునేవారు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు మందలించినప్పటికీ వారిలో ఏమాత్రం మార్పు రాలేదు. ఈ నేపథ్యంలోనే తమ కుమార్తెకు వేరే వ్యక్తితో పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. రెండు వారాల క్రితం దూరపు బంధువైన కోటకందుకూరు గ్రామానికి చెందిన ఖాజాబేగ్‌ కుమారుడు గఫార్‌బేగ్‌తో పెళ్లి నిశ్చయించారు.
ఫిబ్రవరిలో పెళ్లి జరిపించాలనుకున్నారు. అయితే ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టంలేని ఆ యువతి ఎలాగైనా గఫార్‌బేగ్‌ను అడ్డు తొలగించుకోవాలని భావించింది. తన ప్రియుడితో కలిసి స్కెచ్‌ వేసింది. మరో ముగ్గురు సాయంతో పక్కా ప్లాన్ గా హతమార్చింది. ఓరోజు కాబోయే భర్తను ఇంటికి రావాలంటూ కోరింది. అతను స్వీట్లు, పండ్లు తీసుకుని వెళ్లాడు. అక్కడ సుమారు రెండు గంటలు గడిపాడు. అప్పటికే చీకటి పడడంతో ఇంటి దగ్గర వాళ్లు ఎదురు చూస్తుంటారని తన మోటార్‌ బైక్‌పై గ్రామానికి బయలుదేరాడు. అయితే అప్పటికే కోటకందుకూరు సమీపంలోకి వెళ్లి సిద్ధంగా ఉండాలంటూ ప్రియుడుతో పాటు మరో యువకుడిని బైక్‌పై పంపించింది. అతను ఏ దారిలో వెళ్తాడోనన్న అనుమానంతో మరో ఇద్దరిని ఇంకో బైకుపై అతన్ని అనుసరించేలా పంపి.. నిమిష నిమిషానికి ఫోనులో సమాచారం కనుగొంది.
గఫార్‌బేగ్‌ గ్రామ శివారులోకి వెళ్లేసరికి ముందే అక్కడ కాపు గాచిన ఆ యువతి ప్రియుడు, మరో యువకుడు బైక్‌ను అటకాయించి దాడి చేశారు. అంతలోపే వెనుక నుంచి వచ్చిన మరో ఇద్దరు యువకులు కలిసి అతన్ని కత్తులతో పొడిచి చంపారు. తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. అయితే కోటకందుకూరు సమీపాన యువకుడి మృతదేహం పడి ఉందన్న సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. అప్పటికే రాత్రి కావడంతో మృతదేహంపై కత్తిపోట్లు స్పష్టంగా కన్పించలేదు. ముందు రోడ్డు ప్రమాదమని భావించారు. తర్వాత సంఘటనా స్థలిని క్షుణ్ణంగా పరిశీలించి..అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. డీఎస్పీ రాజేంద్ర ఆదేశాల మేరకు మృతుడి సెల్‌ఫోన్‌ ఆధారంగా కూపీ లాగారు. అసలు విషయం బయటకు రావడంతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే ఈ రోజు సాయంత్రం పోలీసులు అధికారికంగా ప్రకటించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com