ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీహార్‌ ఫలితాలపై ఉత్కంఠ..

national |  Suryaa Desk  | Published : Tue, Nov 10, 2020, 08:46 AM

బీహార్‌‌ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిపై స్వల్ప తేడాతో మహాఘట్‌ బంధన్‌ విజయం సాధించబోతుందని ఎగ్జిట్స్‌ పోల్స్‌ అంచనా వేసినా.. ఓటర్లు అధికారికంగా ఎవరికి పట్టంకట్టబోతున్నారో మరోకొన్ని గంటల్లో తేలబోతోంది. బీహార్‌లో ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తున్నారు. తర్వాత ఈవీఎంలలోని ఓట్లను లెక్కించనున్నారు. తొలి ఫలితం 9 గంటల 30  నిముషాలకు వెల్లడయ్యే అవకాశం ఉంది. అయితే తుది ఫలితాల వెల్లడిలో కాస్త జాప్యం జరిగే అవకాశాలున్నాయి.


ప్రతీ అసెంబ్లీ స్థానంలో కనీసం 5 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. అక్కడి ఓట్లను వీవీపాట్‌ల స్లిప్పులను కలపాల్సి వుంటుంది. రాష్ట్రంలోని మొత్తం 243 స్థానాలకు మూడు విడుతలుగా ఎన్నికలు జరిగాయి. గత నెల 28న తొలివిడుత పోలింగ్‌ జరగ్గా.. ఈ నెల 3న రెండో విడుత, 7న మూడో విడుత పోలింగ్‌ జరిగింది.  కొవిడ్‌ నేపథ్యంలో కౌంటింగ్‌లో భౌతికదూరం నిబంధన పాటించాల్సిన కారణంగా ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఈ సారి కౌంటింగ్‌ కేంద్రాలను పెంచారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని 38 జిల్లాల్లో ఓట్ల లెక్కింపునకు 38 కౌంటింగ్‌ సెంటర్లను వినియోగించారు. ప్రస్తుతం ఆ సంఖ్యను 55కు పెంచారు. ఈ కేంద్రాల్లో మొత్తం 414 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు.


 


ఈ సారి భారీ సంఖ్యలో వృద్ధులు, కోవిడ్ బాధితులు పోస్టల్ బ్యాలెట్ విధానంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్నాలో 14 నియోజకవర్గాల ఓట్లను కేవలం ఒకే కౌంటింగ్‌ కేంద్రంలో (ఏఎన్‌ కళాశాల) లెక్కించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికల్లో నితీశ్‌ నేతృత్వంలోని అధికార జనతా దళ్‌ యునైటెడ్‌ జేడీ(యూ), బీజేపీ కూటమిగా పోటీ చేయగా.. ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలు మహాగట్‌ బంధన్‌ పేరుతో కూటమిగా బరిలోకి దిగాయి.  జేడీయూ 115 స్థానాల్లో, బీజేపీ 110 స్థానాల్లో పోటీ చేశాయి. ఆర్జేడీ-144 స్థానాల్లో, కాంగ్రెస్‌ -70 స్థానాల్లో, సీపీఐ, సీపీఎం-29 స్థానాల్లో బరిలో నిలిచాయి.


 


చిరాగ్‌ పాసవాన్‌ నేతృత్వంలోని ఎల్‌జేపీ 134 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసింది. హిందుస్థాన్‌ ఆవాస్‌ మోర్చా-7 స్థానాల్లో, వికాస్‌ శీల్‌ ఇన్సాన్‌ పార్టీ 11 స్థానాల్లో పోటీపడ్డాయి. బీహార్‌లో మొత్తం 243 శాసనసభ స్థానాలుండగా.. 122 స్థానాల మ్యాజిక్‌ ఫిగర్ దాటిన వారిదే అధికారం‌. పలు కీలక స్థానాల ఫలితాలపై సర్వత్రా ఆస్తి నెలకొంది. మహాగట్‌ బంధన్‌ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్‌ రాఘోపూర్‌ స్థానం నుంచి పోటీ చేయగా.. ఆయన సోదరుడు  తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ హసన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. మంత్రుల గెలుపోటములపైనా తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. మంత్రులు పోటీ చేస్తున్న స్థానాలు.. పట్నా సాహెమ్‌ నుంచి నంద కిశోర్‌, మోతిహరి నుంచి ప్రమోద్‌కుమార్‌, మధుబన్‌ నుంచి రాణా రణ్‌దీర్‌, ముజఫర్‌పుర్‌ స్థానం నుంచి సురేశ్‌ శర్మ, నలంద నుంచి శ్వరణ్‌కుమార్‌,  దినార-జై కుమార్‌ సింగ్‌, జెహానాబాద్‌ నుంచి కృష్ణనందన్‌ ప్రసాద్ బరిలో ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com